‘హైదరాబాద్ ఆదాయం తగ్గడానికి హైడ్రానే కారణం’
రాష్ట్రానికి రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తుంది అని చెప్తున్నారు. రూ.12వేల కోట్ల ఆదాయం వస్తుంది అని కాగ్ చెప్తుందని కవిత చెప్తున్నారు.;
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే 4 ప్రాజెక్ట్లు కూలిపోయాయని, ప్రాజెక్ట్ల నిర్వహణను ప్రభుత్వం నిర్లక్షం చేయడమే ఇందుకు ప్రధాన కారణమని ఆమె విమర్శించారు. పైగా వారి వైఫల్యాలకు బీఆర్ఎస్, కేసీఆర్లను బాధ్యులను చేసే ప్రయత్నం జరగుతుందని ఆరోపించారు. తమ చేతకాని తనాన్ని బీఆర్ఎస్కు అంటగట్టడానికి కాంగ్రెస్, రేవంత్ తెగ కష్టపడుతున్నారని విమర్శించారు. దృష్టి పెట్టాల్సిన అంశాలను అటకెక్కించి కేసీఆర్పై ఇష్టానుసారంగా విమర్శలు, ఆరోపణలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం తీరు ఉందని అన్నారు. దేని గురించి ప్రశ్నించినా.. బీఆర్ఎస్ చేసిన అప్పులే కారణమంటూ.. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ బిజీ అయిపోయిందని, కానీ కాగ్.. అసలు రాష్ట్ర అప్పు ఎంతో స్పష్టంగా చెప్పిందని అన్నారు కవిత.
‘‘రూ.6500 కోట్లు వడ్డీ కడుతున్నం అని అబద్ధాలు చెప్పారు. చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. రాష్ట్రానికి రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తుంది అని చెప్తున్నారు. రూ.12వేల కోట్ల ఆదాయం వస్తుంది అని కాగ్ చెప్తుంది. రాష్ట్ర ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం హైడ్రా. హైడ్రా తో దారుణంగా రాష్ట్ర ఆదాయం 5వేల కోట్ల వరకు పడిపోతుంది. హై కోర్టు హెచ్చరిస్తున్నా కూల్చివేతలు ఆపడం లేదు. కొత్త విషయాలు ఏవీ మోడీ తో మాట్లాడలేదు’’ అని అన్నారు.
‘‘Slbc విషయంలో కేసిఆర్ పై విషం చిమ్ముతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి రూ.100 కోట్లు నిధుల కాంట్రాక్టు జానారెడ్డి ముందే ఇచ్చిన గొప్ప వ్యక్తి కేసిఆర్. రూ.3300 కోట్లు అప్పటి టీడీపీ,కాంగ్రెస్ ప్రభుత్వాలు ఖర్చు పెడితే రూ.3900 కోట్లు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎనిమిది మంది ప్రాణాలు పోతుంటే ఎన్నికల ప్రచారం లో పాల్గొంటున్నారు రేవంత్ రెడ్డి. పాత రిప్రజెన్టేషన్ ను కొత్తగా ఇచ్చారు తప్ప చేసింది లేదు తెచ్చింది లేదు. కాంగ్రెస్ 15 నెలల పాలనలో 4 ప్రాజెక్టులు కూలిపోయాయి. ప్రధాని మోడీ రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత ఎంత నిధులు తెచ్చారు?’’ అని ప్రశ్నించారు.
‘‘మోదీని కలిసి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ను ఖతం చేస్తాం, లేకుండా చేస్తాం అని ప్రకటనలు చేస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబం అంటే రాష్ట్రానికి కట్టుబడి ఉన్న కుటుంబం. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఎనుముల కుటుంబం అంటే ఒక న్యాయం?, కల్వకుంట్ల కుటుంబం అంటే ఒక న్యాయమా? మిస్టరీగా మరణాలు అని చిట్ చాట్ లో మాట్లాడి అవీ పేపర్ ప్రధాన వార్తలు వస్తున్నాయి. ఈ హెడ్ లైన్ల తో, ఇలాంటి ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్పై దాడి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల, రాష్ట్ర హక్కులే బీఆర్ఎస్ ముఖ్యం’’ అని అన్నారు.
‘‘ఆరుగురు అనుమానాస్పదంగా చనిపోయారు అని మా కుటుంబం పై నెపం నెడుతున్నారు. ప్రధాని నీ కల్సిన తర్వాత రేవంత్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నాడు. అంటే ఇందులో పెద్ద యెత్తున కుట్ర కూడా ఉంది. టన్నెల్ లో ఇంత పెద్ద ప్రమాదం జరిగితే కనీసం రివ్యూ చేయలేదు. సహాయక చర్యల అంశం పై మాట్లాడటం లేదు. ఎనిమిది మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు వారి ఉన్నారో లేదో తెలియదు..ఢిల్లీ యాత్రలు, ఎన్నికల ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.