మరికొద్ది సేపట్లో అమృత, ప్రణయ్ కేసులో తుది తీర్పు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పరువు హత్య కేసులో తుది తీర్పు మరికొద్ది గంటల్లో వెలువడనుంది. అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్ హత్య కు గురయ్యారు;
By : The Federal
Update: 2025-03-10 03:40 GMT
అమృత, ప్రణయ్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో తుది తీర్పు మరికొద్ది గంటల్లో వెలువడనుంది. నల్గొండ జిల్లాలో అమృత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్ అనే యువకుడిని అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించారు. 2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య కేసు తీవ్ర సంచలనం రేపింది. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారుతీరావుతో సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతోనే ఆమె తండ్రి మారుతీ రావు సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి 2019 జూన్ 12న 1600 పేజీలతో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఛార్జిషీటు నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సాంకేతిక ఆధారాలతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించింది. తుది తీర్పును మార్చి 10కి న్యాయస్థానం రిజర్వు చేసింది.
సుమారు ఐదున్నర ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. ఈ మధ్యలోనే తీవ్ర మనస్థాపంతో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు 2020 మార్చి 7న హైదరాబాద్ ఆర్య వైశ్య భవనంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా, సుభాష్ శర్మ, అజ్గర్ ఆలీ, అబ్దుల్ బారీ, ఎంఎ కరీం, తిరునగరు శ్రవణ్ కుమార్, శివ, నిజాంలు నిందితులుగా ఉన్నారు.
వీరిలో సుభాష్ శర్మ, అస్గర్ ఆలీ మినహా మిగతా ఐదుగురు నిందితులు గతంలోనే బెయిల్పై విడుదలయ్యారు. అస్గర్ ఆలీ గతంలో గుజరాత్ మాజీ హోంశాఖ మంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రలోనూ కీలక నిందితుడిగా ఉన్నారు. కాగా, ఈ కేసులో న్యాయస్థానం వెల్లడించే తుది తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీస్ యంత్రాంగం.. విచారణ పూర్తి చేసి..ఎనిమిది మందిని నిందితులుగా 2019లో ఛార్జిషీటు దాఖలు చేశారు. సుమారు ఐదేళ్ల పైగా కోర్టులో విచారణ సాగగా..ఇటీవలే వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.