సీఎం రేవంత్‌రెడ్డికి తలనొప్పిగా మారిన కోర్టు కేసులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి పలు కోర్టు కేసులు తలనొప్పిగా మారాయి.కీలకమైన ఓటుకు నోటు కేసుతో పాటు పలు కేసులు కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి.

Update: 2024-10-16 12:46 GMT

తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డికి పలు కేసులు వెంటాడుతున్నాయి. ఓటుకు నోటు కేసుతోపాటు కొత్తగా పలు పరువు నష్టం కేసులు కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. 2015వ సంవత్సరం జూన్ 1వతేదీన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో 2021 జులై 21వతేదీన దాఖలు చేసిన చార్జిషీటును ఏసీబీ వేసింది. బుధవారం నాటి కేసు విచారణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాల్సిందేనని నాంపల్లి కోర్టు జడ్జి గత నెల 24వతేదీన విచారణలో ఆదేశించారు. కోర్టు విచారణకు సీఎం రేవంత్, ఉదయసింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ హాజరు కావాల్సి ఉంది. సీఎం కోర్టుకు హాజరు కాకపోతే తాను కోర్టు ముందు నిరాహార దీక్ష చేస్తానని మత్తయ్య చెప్పారు.


నవంబరు 14కు కేసు వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణ నవంబర్ 14వతేదీకి వాయిదా వేశారు. నాంపల్లి జడ్జి సెలవులో ఉండటంతో కేసును వాయిదా వేస్తుననట్లు ప్రకటించారు. నాంపల్లి కోర్టులో నేడు ఓటుకు నోటు ఈడీ కేసు కూడా విచారణ జరగాల్సి ఉంది.

సీఎం రేవంత్ పై పరువునష్టం దావా
సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ నాయకులు వేసిన క్రిమినల్‌ పరువు నష్టం కేసులో నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం చేశారని బీజేపీ నేత కాసం వేంకటేశ్వర్లు పిటిషన్ దాఖలు చేశారు.బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తుందని రేవంత్ ప్రచారం చేశారని బీజేపీ నేత కాసం వేంకటేశ్వర్లు కేసు దాఖలు చేశారు.ఆ కేసులో రేవంత్‌ రెడ్డికి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది.రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.తదుపరి విచారణ ఈ నెల 23కు తేదీకి నాంపల్లి స్పెషల్ కోర్టు వాయిదా వేసింది.


Tags:    

Similar News