రేవంత్ ను జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారా ?

రేవంత్ నిర్ణయాలపై సొంతపార్టీలోనే వ్యతిరేకత మొదలైందా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది.

Update: 2024-06-23 12:12 GMT

రేవంత్ నిర్ణయాలపై సొంతపార్టీలోనే వ్యతిరేకత మొదలైందా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. పార్టీలో సీనియర్ నేత, ఎంఎల్సీ టీ. జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. జీవన్ అభ్యంతరం ఏ విషయంలో అంటే సీనియర్ నేత, బీఆర్ఎస్ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకునే విషయంలో. రెండు రోజుల క్రితం పోచారం కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. జీవన్ రెడ్డి ప్రస్తుతం నిజామాబాద్-ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎంఎల్సీగా ఉన్నారు. పోచారం కాంగ్రెస్ లో చేరటాన్ని జీవన్ అవకాశవాద రాజకీయంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. పోచారం చేరికను జీవన్ ఏ విధంగా చూశారన్నది పక్కన పెట్టేస్తే రేవంత్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారన్న విషయం అర్ధమైపోతోంది.

ఇప్పటివరకు బీఆర్ఎస్ కు చెందిన ఎంఎల్ఏలు ముగ్గురు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు హస్తంపార్టీలో చేరారు. అప్పుడు జీవన్ ఏమీ మాట్లాడలేదు. మరిపుడు పోచారం చేరికపైన ఎందుకు ఇలాంటి కామెంట్లు చేశారో అర్ధంకావటంలేదు. అవకాశవాద రాజకీయాలకు తాను వ్యతిరేకమని చెప్పటమే కాకుండా తాను ప్రోత్సహించనని కూడా స్పష్టంచేశారు. పోచారం చేరిక మాత్రమే అవకాశవాద రాజకీయమా ? లేకపోతే దానం, కడియం, తెల్లం చేరికలను కూడా అవకాశవాద రాజకీయంగానే జీవన్ చూస్తున్నారా అనే చర్చ పార్టీలో మొదలైంది. ఇప్పుడు విషయం ఏమిటంటే కాంగ్రెస్ కు అత్తెసరు సీట్లు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ఏ పార్టీకైనా 61 సీట్లకు పైగా రావాలంటే కాంగ్రెస్ కు వచ్చింది 64 మాత్రమే. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజైనా కూలిపోవచ్చని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పదేపదే చెబుతున్నారు. ఇందుకనే ప్రభుత్వాన్ని సుస్ధిరపరుచుకోవటంలో భాగంగా రేవంత్ బీఆర్ఎస్ ఎంఎల్ఏలను చేర్చుకోవటంపై దృష్టిపెట్టారు. ఇప్పటికి ముగ్గురు చేరటంతో పాటు కంటోన్మెంట్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి గెలవటంతో పార్టీ బలం 68కి పెరిగింది.

ఈ సంఖ్యను మరింతగా పెంచుకోవాలని రేవంత్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. తొందరలోనే బీఆర్ఎస్ కు చెందిన 20 మంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరుతారని, కాదు కాదు 25 మంది రాబోతున్నారంటు విపరీతమైన ప్రచారం జరుగుతోంది. పోచారం చేరికనే సహించలేకపోయిన జీవన్ మరి టోకుగా బీఆర్ఎస్ ఎంఎల్ఏలు వచ్చి కాంగ్రెస్ లో చేరితే అప్పుడేమంటారో చూడాలి. 65 మంది ఎంఎల్ఏల బలంతో సుస్ధిరమైన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసినపుడు ఇక ఇతర పార్టీల ఎంఎల్ఏలను చేర్చుకోవాల్సిన అవసరం ఏమిటన్నది జీవన్ ప్రశ్న. ప్రశ్న వరకు బాగానే ఉంది కాని ఏదేనా కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వం తల్లకిందులయ్యే పరిస్ధితి వస్తే అప్పుడు ఏమిచేస్తారనే ప్రశ్నకు జీవన్ దగ్గర సమాధానం లేనట్లుంది. ఏదేమైనా రేవంత్ నిర్ణయాన్నే ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్న జీవన్ కామెంట్లు పార్టీలో సంచలనంగా మారిందన్నది వాస్తవం.

Tags:    

Similar News