ప్రజావాణి పారదర్శకతపై సీఎం వ్యాఖ్యలు
వివిధ పథకాల సమాచారాన్ని ఆన్లైన్లో పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.;

ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రజావాణి. ప్రతి సోమవారం ప్రజల నుంచి కలెక్టర్ నేరుగా అర్జీలను స్వీకరిస్తారు. వారి అర్జీలను అక్కడిక్కడే సంబంధిత అధికారికి బదిలీ చేయడంతో పాటు ఆ సమస్య త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటారు. ప్రజావాణి చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్న కార్యక్రమం. కాగా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రజావాణి నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజావాణిని మరింత పాదర్శకంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ సూచించారు. జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న పర్జావాణి కార్యక్రమాన్ని ప్రజాభవన్లో కొనసాగుతున్న ప్రజావాణ డ్యాష్బోర్డ్తో అనుసంధానం చేయాలని చెప్పారు.
2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించగా, అందులో 54,619 అర్జీలను ప్రజలు నమోదు చేసుకున్నారు. వీటిలో 68.4 శాతం (37,384) అర్జీలు పరిష్కారమయ్యాయని అధికారులు సీఎం రేవంత్కు వివరించారు. అర్జీల వివరాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల సమాచారాన్ని ఆన్లైన్లో పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వాటి అమలు పురోగతి పారదర్శకంగా అందరూ తెలుసుకునేందుకు వీలుగా ఉండేలా ఈ పోర్టల్ రూపొందించాలని సూచించారు. వివిధ విభాగాలకు ప్రజావాణిలో ప్రత్యేక డెస్క్లు ఏర్పాటు చేశామని, గల్ఫ్ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. అర్జీదారులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అత్యవసరమైన అర్జీలుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తామని, అంబులెన్స్ సదుపాయం కూడా ప్రజావాణి జరిగే రోజుల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
ప్రజావాణి డ్యాష్ బోర్డు యాక్సెస్ను తనకు అందించాలని, తనకు లైవ్ యాక్సెస్ ఉండేలా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తద్వారా తాను ఎక్కడ ఉన్నా ప్రజావాణి అర్జీల పరిష్కారం తీరును, ప్రజల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వస్తున్నాయో తెలుసుకునే వీలుంటుందని, అర్జీల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేయటం సులభమవుతుందని అన్నారు. ప్రజల వ్యక్తిగత భద్రతకు ఇబ్బంది లేకుండా అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ఏయే సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి, వేటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది ముందుగా సమీక్షించుకోవాలన్నారు. అధికారుల స్థాయిలో కమిటీ వేసి అందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.