తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఎ రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.2023 డిసెంబరు 26వతేదీన సీఎం మోదీని కలిశారు. ప్రధానితో జరిగిన మర్యాద పూర్వక భేటీలో తెలంగాణలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులు, వాటి సత్వర పరిష్కారానికి, రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని ప్రదానమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
12అంశాలపై ప్రధానికి వినతి పత్రం
తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం వద్ద పెండింగులో ఉన్న కీలకమైన 12 అంశాలపై సీఎం ఎ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కలు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి వినతి పత్రం సమర్పించారు. 2024వ సంవత్సరం జులై 4 జులై 4వతేదీన భేటీలో పలు తెలంగాణ పెండింగు ప్రాజెక్టుల గురించి వారు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. కేంద్రం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును తొలగించి, సింగరేణికి కేటాయించాలని,కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3 గనులను సింగరేణికి కేటాయించాలి వారు కోరారు.తెలంగాణకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) మంజూరు చేయాలని ప్రధానమంత్రికి విన్నవించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ITIR) ప్రాజెక్టు పునరుద్ధరించాలని,కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని కోరారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ లో తెలంగాణను చేర్చాలని, రాబోయే 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
పెండింగులోనే ప్రాజెక్టులు...
పెండింగ్లో ఉన్న బీఆర్ జీఎఫ్ (BRGF)గ్రాంట్ ను తక్షణం విడుదల చేయాలని ,రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని, ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వారు ప్రధానిని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తించి,భారత్ మాల పరియోజనలో దీనిని కలపాలని, 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని సూచించారు.కొత్త జిల్లాల్లో 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని సీఎం ప్రధానికి విన్నవించారు.
తెలంగాణ రైజింగ్ విజన్ కు మద్ధతు ఇవ్వండి : సీఎం
తెలంగాణ రైజింగ్ విజన్ కు మద్ధతు ఇవ్వాలని, తద్వారా 1 ట్రిలియన్ జీడీపీ లక్ష్యాన్ని సాధించ గలమని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ రావులు ప్రధాన మత్రి నరేంద్రమోదీని ఈ ఏడాది ఫిబ్రవరి 26వతేదీన కలిసి విన్నవించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం సహకారం అందించాలని వారు కోరారు. కీలకమైన మౌలిక సదుపాయాలు, పట్టణ పరివర్తన ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసి, నిధుల మద్దతు కోసం ప్రధానమంత్రిని వారు అభ్యర్థించారు.
బనకచర్ల ప్రాజెక్టు ప్రీ - ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించండి
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు ప్రీ - ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించాలని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ -1980 (జీడబ్ల్యూడీటీ), ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం – 2014 లకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఎం కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు.బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయని చెప్పారు.జాతీయ ప్రాజెక్టు పోలవరం విషయంలో ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఏపీ భావిస్తే.. పోలవరం - బనకచర్లకు బదులు కేంద్రం నిధులు ఇచ్చి ఇచ్చంపల్లి - నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణకు గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేయాలని, దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. 1500 టీఎంసీల నీటితో కోటిన్నర ఎకరాలకు నీరు అందుతుందని, ఆ తర్వాత ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు.
తెలంగాణకు నిధుల కోసం మోదీని 50 సార్లు అయినా కలుస్తా : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకొని రావడానికి, పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులను పొందడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 50 సార్లు అయినా కలవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.‘‘ఎన్నికల సమయంలోనే రాజకీయాలు జరుగుతాయి. ఎన్నికల తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కేంద్రం మద్దతు తీసుకుంటాం. మేం ప్రధాని నరేంద్ర మోదీని ఒక్కసారి కాదు, 50 సార్లు కూడా కలుస్తాం. మాకు రావాల్సిన నిధులను మేము సేకరిస్తాం. అవసరమైన అనుమతులు మాకు లభిస్తాయి’’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడానికి, అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం,ప్రతిపక్షాల సహకారం కావాలని కోరారు.ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని,కీలకమైన ప్రజా సమస్యలపై చర్చల్లో పాల్గొనాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కె చంద్రశేఖర్ రావును కూడా సీఎం కోరారు.
తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులతో మోదీ భేటి
తెలంగాణ రాష్ట్రంలోని 8 మంది బీజేపీ ఎంపీలతోపాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిదులు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి మాట్లాడారు. కాని తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టుల ఊసు ఎత్తకుండా తెలంగాణలో బీజేపీ పటిష్ఠానికి తీసుకోనున్న చర్యలపై మాట్లాడారు.కనీసం తెలంగాణ సమస్యల గురించి ప్రధాని వద్ద బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రస్తావించలేదు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరిలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర సమస్యలపై ఇటీవల వినతిపత్రాన్ని సమర్పించారు.