చిన్నారుల ఆరోగ్యానికి పాలు: తెలంగాణ సర్కారు కొత్త బహుమతి

అంగన్‌వాడీ పిల్లలకు రోజూ 100 మిల్లీలీటర్ల పాలు… తెలంగాణలో కొత్త పైలెట్ ప్రాజెక్టు

Update: 2025-11-18 02:20 GMT
అంగన్ వాడీ పిల్లలకు పాలు : ఇక పోషకాహార తెలంగాణ

పిల్లలు దేవుని రూపాలు అని చెబుతారు… అలాంటి చిన్నారుల ఆరోగ్యం, పోషణ పట్ల తెలంగాణ ప్రభుత్వం మరో ప్రత్యేకమైన సంక్షేమ అడుగు వేసింది. ములుగు అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ప్రతిరోజూ పాలు అందించే కార్యక్రమాన్ని ఆవిష్కరించి కొత్త ఆశాకిరణాన్ని వెలిగించింది.పోషకాహార లోపం లేని తెలంగాణ లక్ష్యంగా, రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంక్షేమ ప్రస్థానాన్ని ప్రారంభించింది. చిన్నారుల ఆరోగ్య భద్రత కోసం తీసుకున్న నిర్ణయంగా ములుగు జిల్లాలో అంగన్‌వాడీ పిల్లలకు ఉచిత పాలు పంపిణీ పైలెట్ ప్రాజెక్టుకు నాంది పలికింది.


- తెలంగాణ రాష్ట్రంలో పిల్లల సంక్షేమం కోసం ఓ కొత్త పైలెట్ ప్రాజెక్టును ప్రభుత్వం ఆరంభించింది.పోషకాహార లోపం లేని తెలంగాణను ఏర్పాటు దిశగా సర్కారు అడుగులు వేయనుంది.దీనిలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతీ రోజూ 100 మిల్లీలీటర్ల పాలను పంపిణీ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమానికి తెలంగాణ సర్కారు సోమవారం శ్రీకారం చుట్టింది.

- పిల్లలను దేవుడి లాంటి వారని చెబుతుంటారు. అలాంటి పిల్లల ఆరోగ్య పరిరక్షణే పరమావధిగా భావించి గిరిజనులు అధికంగా నివాసం ఉంటున్న మారుమూల ములుగు జిల్లాలోని అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు పాలు ఇచ్చే వినూత్న కార్యక్రమాన్ని తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రారంభించారు. పిల్లలకు పాల గ్లాసులు అందించి వారితో తాగించారు.



 అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం

కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తామని, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.అంగన్ వాడీ సిబ్బంది బాల్యవివాహాల నివారణ, బాలల రక్షణ కోసం పనిచేయాలని మంత్రి కోరారు. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధుల సంక్షేమ వారం, బాలల హక్కుల వారంపై పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు.ములుగు జిల్లాలో మొదట పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన పిల్లలకు పాలు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి ప్రకటించారు. 3 నుంచి 6 సంవత్సరాల వయసున్న పిల్లలకు అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రతీరోజూ గ్లాసు పాలను అందిస్తున్నామని మంత్రి చెప్పారు. పేద పిల్లల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి వివరించారు.

చిన్నారుల పోషకాహార భద్రత కోసం ప్రారంభించిన ఈ పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద అడుగు వేస్తుందని చెప్పవచ్చు.అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు చేరడం, చిన్నారుల చేతిలో పాల గ్లాసు మాత్రమే కాదు...ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు నాంది. తెలంగాణ చిన్నారులు ఆరోగ్యంగా, బలంగా ఎదగాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ పథకం సార్థకతను తీసుకురావాలని అందరూ ఆశిస్తున్నారు.


Tags:    

Similar News