లిఫ్ట్లో ఇరుక్కున్న బాలుడు మృతి
బాలుడిని బతికించడానికి తీవ్రంగా శ్రమించినా లాభం లేకపోయిందని వైద్య బృందం తెలిపింది.;
నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్కు గోడకు మధ్య ఇరుక్కుపోయిన బాలుడిని హైడ్రా అధికారులు దాదాపు రెండున్నర గంటలపాటు కష్టపడి బయటకు తీశారు. అనంతరం ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికి్త్స పొందుతున్న బాలుడు శనివారం ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. పూర్తి వివరాలు చూస్తే.. ఆగాపుర గోడేకిఖబర్ ప్రాంతానికిచెందిన అజయ్ కుమార్ అనే ఆరేళ్ల బాలుడు శుక్రవారం తన తాతయ్యతో కలిసి రెడ్హిల్స్ శాంతినగర్ పార్కు ఎదురుగా ఉన్న మఫర్ కంఫర్ట్ అపార్ట్మెంట్లో ఉంటున్న మేనత్త ఇంటికి వెళ్లాడు. తాత చేతిలో లగేజీ ఉండటంతో బాలుడు లిఫ్ట్ గ్రిల్స్ తెరిచి ముందు లోపలికి వెళ్లాడు. బాలుడి తాతయ్య లగేజీ పెట్టేలోపే లిఫ్ట్ కదలింది. లిఫ్ట్ పైయి వెళ్తుండటంతో భయపడిన బాలుడు బయటకు వచ్చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే లిఫ్ట్కు, గోడకు మధ్య ఇరుక్కుపోయాడు. బాలుడు ఇరుక్కుపోవడంతో లిఫ్ట్.. మొదటి అంతస్తు, గ్రౌండ్ ఫ్లోర్కు మధ్యలో ఆగిపోయింది. బాలుడి కేకలు, తాతయ్య అరుపులతో అపార్ట్మెంట్ వాసులు అప్రమత్తమయ్యారు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి పోలీసులకు ఫోన్ చేశారు.
వెంటనే అక్కడకు చేరుకున్న నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్.. డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు, 108 అంబులెన్స్లను రప్పించిన హుటాహుటిన సహాయకచర్యలు చేపట్టారు. దాదాపు రెండున్నర గంటలపాటు కష్టపడి బాబును బయటకు తీసి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. బాలుడి నడుపు, కడుపు భాగాన తీవ్రంగా తాయాలు కావడంతో బాలుడు స్పృహకోల్పోయాడు. కాగా ఐసీయూలో చికిత్స పొందుతూ బాలుడు శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచాడు. బాలుడిని బతికించడానికి తీవ్రంగా శ్రమించినా లాభం లేకపోయిందని వైద్య బృందం తెలిపింది.