రాచకొండలోనూ డీజేపై నిషేధం,సీపీ సుధీర్‌బాబు ఉత్తర్వులు

హైదరాబాద్‌లో డీజేపై నిషేధం విధించిన మరునాడే రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో కూడా డీజే వినియోగంపై నిషేధం విధిస్తూ సీపీ జి సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2024-10-02 15:38 GMT

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ బుధవారం పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

- డీజేల నుంచి అధిక డెసిబెల్స్ తో ఉత్పన్నమయ్యే శబ్దాల కారణంగా హృద్రోగులకు గుండెపోటు, ఇతర హృదయ సంబంధ ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉండడంతో పాటు చిన్నపిల్లలకు శాశ్వత వినికిడి సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్టు పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయని సీపీ నిషేధ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- సామాన్య ప్రజలు,ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంతో ఇకపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఊరేగింపుల్లో డిజే సౌండ్ మిక్సర్లు,యాంప్లిఫయర్, బాణసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ పోలీసు కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఉల్లంఘిస్తే జైలు శిక్ష, జరిమానా: సీపీ
ఈ నిబంధనలు, ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘిస్తే బీఎన్ఎస్ 223, 280, 292, 293, 324, బీఎన్ఎస్ఎస్ 152, పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 15 కింద కేసులు నమోదు చేస్తామని సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు.ఈ నిషేధ ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమిస్తే ఐదేళ్లు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా ఉంటుందని కమిషనర్ తెలిపారు. ఈ ఉత్తర్వులు పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాచకొండ పరిధిలోని అన్ని జోన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సీపీ పేర్కొన్నారు.

ప్రజాభిప్రాయం మేరకే డీజేపై నిషేధం
ప్రజలకు, విధుల్లో ఉండే అధికారులకు కలుగుతున్న ఇబ్బందులు, తలెత్తున్న సమస్యలను విశ్లేషించి అందరీ అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు సుధీర్ బాబు వివరించారు.


Tags:    

Similar News