అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం
బిల్లును ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి. ఏపీ విద్యార్థులకు 25శాతం సీట్లు రిజర్వ్
By : The Federal
Update: 2025-09-27 12:00 GMT
న్యాయ విద్య, పరిశోధనకు భారత అంతర్జాతీయ విశ్వవిద్యాలయం బిల్లు(ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎట్ ద ఆంధ్రప్రదేశ్ బిల్-2025) కు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఆమోదించింది.
దానితో ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, సవరణ బిల్లుతో పాటు ఏపీ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు-2025ను కూడా సభ ఆమోదించింది. వీటిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. లా యూనివర్సిటీతో పాటు ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్ అండ్ కన్సల్టేషన్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్, జ్యుడీషియల్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటుచేయాలని నిర్ణయించామని లోకేష్ చెప్పారు.
"దీనికోసం ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అమరావతిలో 55 ఎకరాలను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను పాటిస్తాం. ఏపీ విద్యార్థులకు 25శాతం సీట్లు రిజర్వ్ చేశాం. మరోవైపు కూటమి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటుచేస్తామని గతంలో హామీ ఇచ్చాం. ఆ ప్రక్రియ కూడా ప్రారంభించాం, పూర్తిచేస్తాం. అక్కడ కూడా ఆర్బిట్రేషన్ సెంటర్ ను ఏర్పాటుచేస్తాము, " అని లోకేష్ అన్నారు.
రాష్ట్రానికి ఏదైనా చేయాలనే సంకల్పంతో గవర్నర్ గారు ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే ఈ యూనివర్సిటీని సాధించుకోవడం జరిగింది. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు.
ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, సవరణ బిల్లు గురించి చెబుతూ "ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీల కోసం 11-02-2016లో ప్రత్యేక చట్టం చేశారు. అందులో ప్రధానంగా గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీలు చేశారు. ఈ చట్టం కింద 14 ప్రైవేటు యూనివర్సిటీలు రాష్ట్రానికి వచ్చాయి. ఈ యాక్ట్ కు 2023లో సవరణ చేశారు. ఆ సవరణలో టాప్ -100 గ్లోబల్ యూనివర్సిటీలతో జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీ ఉంటేనే అనుమతించాలని నిబంధన పెట్టారు. యూజీసీ 2022 రెగ్యులేషన్ లో జాయింట్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. న్యాక్ 3.0 కంటే ఎక్కువ ఉండాలి, లేకపోతే కనీసం మూడు గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ లు ఉండాలి, ఎన్ఐఆర్ ఎఫ్ ర్యాంకింగ్స్ లో టాప్-100లో ఉండాలి అంటూ అనేక నిబంధనలు పెట్టారు. దీనివల్ల గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీలు న్యాక్ కు అర్హత సాధించాలంటే కనీసం నాలుగేళ్ల నుంచి ఆరేళ్లు పడుతుంది. త్వరితగతిన జాయింట్ డిగ్రీ అనేది కుదరదు. మనం చేసిన చట్టం ఏకంగా యూజీసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది. దీనివల్ల విదేశీ యూనివర్సిటీలు దేశానికి రావాలన్నా, రాష్ట్రంలో యూనివర్సిటీలు ప్రారంభించాలన్నా ఇబ్బందిగా ఉంది. దీంతో జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీని తొలగించి మన విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య అందించాలి, ఉన్నత విద్యను పెద్దఎత్తున ప్రోత్సహించాలి, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ సవరణ బిల్లును తీసుకువచ్చాము, " అని అన్నారు.