ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 8 మంది సజీవసమాధి
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్ బీసీ) టన్నెల్ ఘటన విషాదాంతంగా మారిందని వార్తలు వెలువడ్డాయి.టన్నెల్ కూలిన ఘటనలో 8 మంది మృత్యువాత పడ్డారని చెబుతున్నారు.;
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్ బీసీ) టన్నెల్ ఘటన విషాదాంతంగా మారిందని వార్తలు వెలువడ్డాయి. టన్నెల్ కూలిన ఘటనలో లోపల చిక్కుకున్న 8 మంది మృత్యువాత పడ్డారని స్థానికులు చెబుతున్నారు. టన్నెల్ కూలినపుడు లోపల చిక్కుకున్న ఇద్దరు ఇంజినీర్లు, ఆరుగురు కార్మికులు సజీవ సమాధి అయ్యారని అంటున్నారు.
టన్నెల్ లో కూలిన మట్టిలో 8 మంది కూరుకు పోయారని ఓ ఎన్డీఆర్ఎఫ్ అధికారి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. టన్నెల్ కూలి ఆరు రోజులు గడవడంతో శుక్రవారం పేరుకున్న మట్టిని ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఎఫ్, సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే బృందాలు సహాయ పనులను ముమ్మరం చేశారు.
మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికితీసేందుకు యత్నిస్తున్నామని అధికారులు చెప్పారు. జీరో గ్రావిటీ పెనట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ సాయంతో ఎన్డీఆఱ్ఎఫ్ స్కాన్ చేయగా మృతదేహాలు ఉన్నాయని సమాచారం . కార్మికుల మృతదేహాలను వెలికితీసే పనులు ముమ్మరం చేశామని ఆర్మీ అధికారి చెప్పారు.
మృతదేహాలు ఇంకా వెలికితీయ లేదు : విపత్తు సహాయ కమిషనర్ అర్వింద్ కుమార్
టన్నెల్ సహాయ చర్యలు ముమ్మరం చేశామని బురద లోపల మృతదేహాలు, కాని ఇతర మెటీరియల్ ఉన్నట్లు తమకు స్కానింగ్ లో తేలిందని తెలంగాణ విపత్తు శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అయితే మృతదేహాలు వెలికితీసే వరకు తాము అధికారికంగా ప్రకటించలేదని ఆయన చెప్పారు. కొన్ని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని, తమ ర్యాల్ మైన్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్ లోపల గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయని, వారు బయటకు రాగానే అసలు వాస్తవాలు చెబుతామని అర్వింద్ కుమార్ చెప్పారు.