త్వరలో కాంగ్రెస్ లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

త్వరలో కాంగ్రెస్ లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

By :  Vanaja
Update: 2024-04-06 15:16 GMT

త్వరలో 25 మంది బీఆర్‌స్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవనుందా? అవును అదే జరగబోతోంది అంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, త్వరలో 25 మంది బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ అహంకారపూరిత వైఖరి వల్లే బీఆర్ఎస్ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. కరీంనగర్‌లో రైతులను పరామర్శించడానికి వెళ్లిన కేసీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరీంనగర్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఉత్తమ్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...

"తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను బొంద పెడితే 104 మంది ఎమ్మెల్యేల నుంచి 39కి పడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిన్ను, నీ పార్టీని ప్రజలు బొంద పెట్టడం ఖాయం. నీకు తెలివి తక్కువ, పొగరు ఎక్కువ. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎవ్వరూ పడరు. ప్రపంచంలో నువ్వొక్కడివే మేధావివా? మేడిగడ్డ కుంగింది అన్నప్పుడు ఎక్కడ ఉన్నావ్. మాకు అభివృద్ధి చేయడం తెలుసు, నీకు కమిషన్లు తీసుకోవడం తెలుసు. రైతులు ప్రస్తుతం ఇబ్బందులు పడడానికి కేసీఆరే కారకుడు. వ్యక్తిగత లాభం కోసం కృష్ణా, సాగర్ జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు. ఎన్నికల తర్వాత మేడిగడ్డకు వెళ్తాడు అంట.. ప్రజలు నిన్ను తొక్కుకుంటూ పోతారు. సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావ్."

"కేసీఆర్ తీసుకొచ్చిన కరువు ఇది. కేసీఆర్ పాలనలో ఏ ప్రాజెక్టు కూడా సక్రమంగా డిజైన్ చేయలేదు. బ్యారేజీలకు, డ్యామ్‌లకు తేడా తెలియని వ్యక్తి కేసీఆర్. లక్ష కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. చిన్న చిన్న తప్పులు అని సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రతి సంవత్సరం 17 వేల కోట్లు అప్పు కట్టాల్సి వస్తోంది. కేసీఆర్ అన్ని అసత్యాలే మాట్లాడుతున్నాడు ఆయన మాటలు నమ్మొద్దు. నష్టపోయిన ప్రతి రైతుకు మా సానుభూతి, నష్టపరిహారం ఉంటుంది" అని ఉత్తమ్ తెలిపారు."

Tags:    

Similar News