రేపటి నుంచి పాక్షికంగా విధులకు..

కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు తిరిగి ప్రారంభంకానున్నాయి. అత్యవసర, తప్పనిసరి సేవలకు తాము రేపటి నుంచి హాజరవుతామని జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు.

Update: 2024-09-20 07:13 GMT

కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు తిరిగి ప్రారంభంకానున్నాయి. అత్యవసర, తప్పనిసరి సేవలకు తాము రేపటి నుంచి హాజరవుతామని జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు. ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు గత 41 రోజులుగా విధులను బహిష్కరించిన విషయం తెలిసిందే.

సీబీఐ కార్యాలయానికి మార్చ్..

ట్రైనీ డాక్టర్ జ్ఞాపకార్థం రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో శుక్రవారం నుంచి అభయ వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యాధికారులు ప్రకటించారు. స్వాస్థ్య భవన్ ముందు తమ 10 రోజుల ధర్నాను ఉపసంహరించుకున్నందుకు గుర్తుగా.. అలాగే కేసు దర్యాప్తును సీబీఐ త్వరగా ముగించాలని కోరుతూ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లాలని వైద్యులు నిర్ణయిచారు.

ఇంకా OPD డ్యూటీ లేదు..

తాము ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (ఓపీడీ) సేవలకు హాజరుకావడం లేదని, కేవలం అత్యవసర, అవసరమైన సేవలకు మాత్రమే అది కూడా పాక్షికంగా హాజరవుతామని వైద్యులు తెలిపారు.

మమత బెనర్జీ హామీలు వారంలోపు అమలుకాకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. జూనియర్ డాక్టర్లు, రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ మధ్య బుధవారం చర్చలు జరిగాయి.

‘‘కోల్‌కతా పోలీసు కమిషనర్, సీనియర్ ఆరోగ్య శాఖ అధికారులను తొలగించాలన్న మా డిమాండ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం విజయంగా భావిస్తున్నాం. అయితే రాష్ట్రంలోని వరదల కారణంగా ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడం వైద్యుల బాధ్యత అని ఆందోళనలో పాల్గొన్న డాక్టర్ అంకిత్ మహతో చెప్పారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో కోల్‌కతా పోలీస్ చీఫ్ వినీత్ గోయల్‌ను బదిలీ చేసి, అతని స్థానంలో మనోజ్ కుమార్ వర్మను నియమించారు, అదే సమయంలో వైద్య విద్య, ఆరోగ్య సేవల డైరెక్టర్లను కూడా తొలగించారు.

మరోవైపు ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్‌ను పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసింది. ప్రస్తుతం CBI కస్టడీలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ ఘోష్‌ను WBMC నిర్వహిస్తున్న రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల జాబితా నుంచి తొలగించారు. 

Tags:    

Similar News