కాంగ్రెస్ మాజీ ఎంపీకి జీవిత ఖైదు విధించిన కోర్టు
సిక్కుల ఊచకోతలో దోషిగా తేలడంతో శిక్ష విధించిన న్యాయస్థానం;
By : Praveen Chepyala
Update: 2025-02-25 13:44 GMT
ఇందిరాగాంధీ హత్య తరువాత జరిగిన సిక్కులు ఊచకోతలో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు ఢిల్లీ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. 1984 లో జస్వంత్ సింగ్, అతని కుమారుడు తరుణ్ దీప్ సింగ్ హత్యలకు సంబంధించి ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఇంతకుముందే సజ్జన్ ను దోషిగా ప్రకటించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలువరించారు.
మరణశిక్ష విధించదగిన కేసులలో ఖైదీల మానసిక పరిస్థితులపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు తీర్పులు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు తీహార్ జైలు అధికారుల నుంచి అటువంటి నివేదికను కోరింది.
గరిష్ట శిక్ష వేయాలి
దేశంలో హత్య నేరాలకు గరిష్టంగా మరణశిక్ష విధించబడుతుంది. కనిష్టంగా జీవిత ఖైదు విధిస్తారు. కుమార్ కు గరిష్టంగా శిక్ష విధించాలని ఫిర్యాదు దారు జస్వంత్ భార్య, ప్రాసిక్యూషన్ కోర్టును కోరాయి. ప్రస్తుతం సజ్జన్ కుమార్ జైలులో ఉన్నారు.
సజ్జన్ కుమార్ చేసిన హత్యలపై మొదట పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. తరువాత ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును చేపట్టింది.
ప్రిమా ఫేసీ కేసు
డిసెంబర్ 16, 2021 న కుమార్ పై కేసు నమోదుకు ప్రాథమిక సాక్ష్యం ఉందని కోర్టు తెలిపింది. ప్రాసిక్యూషన్ ప్రకారం.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక పెద్ద గుంపు మారణాయుధాలతో సిక్కుల ఆస్తులపై దాడి చేసి దోచుకోవడం ప్రారంభించింది.
అలాగే దహానాలు, దాడులు ప్రారంభించింది. ఆ గుంపు ఫిర్యాదుదారు జస్వంత్ భార్య ఇంటిపై దాడి చేసి వ్యక్తులను చంపి వస్తువులను దోచుకుని వారి ఇంటికి నిప్పంటించిందని ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఈ గుంపుకు కుమార్ పాల్గొనడమే కాకుండా నాయకత్వం వహించాడని, దానికి సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడిన తరువాత విచారణ ప్రారంభం అయింది.
ఇందిరాగాంధీ హత్య తరువాత ఏర్పడిన హింస దాని పర్యవసానాలను దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన నానావతి కమిషన్ నివేదిక ప్రకారం.. ఢిల్లీలో రోజుల్లో 2,733 మంది సిక్కులు హత్యకు గురయ్యారు. దీనిపై 587 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఇందులో 240 కేసులను గుర్తించబడనివిగా మూసివేయగా, మరో 250 కేసుల నిందితులను నిర్దోషులుగా విడుదల చేశారు.
ఈ మొత్తం కేసులలో కేవలం 28 ఎఫ్ఐఆర్ లకు మాత్రమే శిక్షలు పడ్డాయి. దాదాపు 400 మంది దోషులుగా నిర్దారించారు. కుమార్ తో సహ దాదాపుగా 50 మందిని హత్య కేసులో దోషులుగా నిర్ధారించారు.
అల్లర్ల సమయంలో కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ అయిన కుమార్ 1984 నవంబర్ 1, 2 తేదీలలో ఢిల్లీలోని పాలం కాలనీలో ఐదుగురు వ్యక్తుల హత్యలకు సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. శిక్షను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్ సుప్రీంకోర్టు ముందు పెండింగ్ లో ఉంది. ఇదే అల్లర్లకు సంబంధించి మరో కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ పై నమోదయిన కేసులపై విచారణ కొనసాగుతుందని ఇంతకుముందే సుప్రీంకోర్టు ప్రకటించింది.