ఈ సమయంలోనే ఎందుకు? ఆయన అరెస్ట్ పై సుప్రీం ప్రశ్నలు..

ఎన్నికల సమయంలోనే ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ను ఎందుకు అరెస్ట్ చేశారని సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది. దీనికి పై..

Update: 2024-04-30 12:27 GMT

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ను ఎందుకు అరెస్ట్ చేశారని దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. దీనికి తమకు సమాధానం ఇవ్వాలని కోరింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం అదనపు సొలిసిటర్ జనరల్ SV రాజును సమయానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఇవ్వమని కోరింది. “జీవితం, స్వేచ్ఛ చాలా ముఖ్యమైనవి. మీరు దానిని కాదనలేరు.” అని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అరెస్ట్ కు సంబంధించి పలు ప్రశ్నలను ధర్మాసనం, సోలిసిటర్ జనరల్ కు ప్రశ్నించింది.

ఎక్సైజ్ పాలసీ స్కామ్, మనీలాండరింగ్ కేసులో తనను అరెస్ట్ చేయడాన్నిసవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు పలు ప్రశ్నలు సంధించారు. తదుపరి విచారణ సందర్భంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోర్టు దర్యాప్తు సంస్థను ఆదేశించింది. శుక్రవారం నాడు కేసు తదుపరి విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో మార్చి 21న అరెస్టయిన తర్వాత కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసి, కేజ్రీవాల్ పిటిషన్‌పై స్పందన కోరింది. ఏప్రిల్ 9న, ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ అరెస్టును సమర్థించింది. సామాన్యులకు, ముఖ్యమంత్రులకు దేశంలో ఒకటే చట్టం ఉందని, రాజకీయ పదవిని అడ్డుపెట్టుకుని నేరాల నుంచి రక్షణ పొందలేరని వ్యాఖ్యానించింది. నిందితులు నేర విచారణ ఎలా జరగాలో నిర్దేశించలేరని ఘూటుగా వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్ కు తొమ్మిదిసార్లు ఈ డీ నోటీసులు పంపితే వాటిని పట్టించుకోలేదని, అందుకే అరెస్ట్ చేసినట్లు దర్యాప్తు సంస్థ చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.
ఢిల్లీ ప్రభుత్వం 2021- 22లో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీలో మద్యం వ్యాపారులకు అనుకూలంగా విధానాలు రూపొందించాడని, బదులుగా వారి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. వీటిలో రూ. 45 కోట్లను గోవా ఎన్నికల సందర్భంగా ఖర్చు చేశారని ఈడీ, సీబీఐ కేసు నమోదు చేశాయి. ఇప్పటికే ఈ కేసులో ఆప్ కీలక నేత మనీస్ సిసోడియా, సత్యేంద్ర జైన్, మరో ఎంపీ జైలు లో ఉన్నారు.


Tags:    

Similar News