ప్రపంచాన్ని కలిపింది యోగా..!

175 దేశాల్లో యోగా డే సామాన్య విషయం కాదు.. యోగాతో శాంతి, సౌభ్రాతృత్వం సాధ్యమవుతుందని చెప్పిన ప్రధాని మోదీ వంట నూనె వాడకాన్ని 10 శాతం తగ్గించాలన్నారు.;

Update: 2025-06-21 05:57 GMT
యోగా డే వేదికపై నుంచి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

యోగా ప్రపంచాన్ని కలిపిందని, 175 దేశాల్లో యోగా సాధనలు చేయడమంటే సామాన్య విషయం కాదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్‌తోనే ఇది సాధ్యమైందని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని యోగా వైపు కదిలించిందని చెప్పారు. యోగాకు వయో పరిమితి, హద్దులు లేవని స్పష్టం చేశారు. విశాఖపట్నం సాగరతీరంలో శనివారం ఉదయం జరిగిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన ఏమన్నారంటే..


అభ్యాసకుల మధ్యలో యోగాసనాలు చేస్తున్న ప్రధాని

దేశ, ప్రపంచ ప్రజలకు అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు. ప్రపంచ వ్యాప్తంగా అశాంతి, అస్తిరత్వం పెరుగుతోంది. యోగా ద్వారా శాంతి, సుస్థిర సాధ్యమవుతుంది. యోగా మనలో మానవత్వాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని కూడా పెంపొందింపజేస్తుంది. మానసిక ఒత్తిడినీ తగ్గిస్తుంది. అంతేకాదు.. వ్యక్తిగత క్రమశిక్షణకూ ఓ అద్భుత సాధనం. ఆధునిక పరిశోధనల్లోనూ ఇది నిరూపితమైంది. అందుకే యోగాతో గడచిన 11 ఏళ్ల తర్వాత 12 కోట్ల మంది జీవనశైలిలో మార్పు వచ్చింది. 175 దేశాల్లో యోగా పాటించడమంటే మామూలు విషయం కాదు. అశాంతి, అలజడి పెరుగుతున్న తరుణంలో యోగాతో ప్రపంచానికి శాంతి చేకూరుతుంది. అందరి క్షేమమే మన కర్తవ్యమని భారతీయ సంస్కృతి చెబుతోంది.

అభ్యాసకుల మధ్యలో నుంచి యోగాసనాలు చేస్తున్న ప్రధాని 

అది యోగాతోనే సాధ్యం.. యోగా సాధన ద్వారా జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ప్రతి గ్రామంలో యోగా ఆవశ్యకతపై అవగాహన పెరుగుతోంది. యోగా వన్‌ ఎర్త్‌.. వన్‌ హెల్త్‌ నినాదం పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందన్న విశ్వాసం నాకుంది. యోగా మానవ శరీరంతో మిళితమై ఉంది. ఇది ఏ ఒక్కరికో పరిమితం కాకూడదు. సమాజంలో అన్ని వర్గాలకు చేరువ కావాలి. యోగా సర్వేజనా సుఖినోభవంతు.. అనే నినాదంగా మారాలి. డిజిటల్‌ టెక్నాలజీలోనూ యోగా ముఖ్య భూమిక పోషిస్తోంది. యోగాను మెడికల్‌ కాలేజీల్లోనూ ప్రవేశపెట్టడంతో పాటు కామన్‌ యోగా ప్రోటోకాల్‌ను తయారు చేస్తున్నాం. యోగాను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికీ యోగాతో రోజు మొదలయ్వాలి అని మోదీ పేర్కొన్నారు.
వంట నూనెలు 10 శాతం తగ్గించాలి..
వంటల్లో నూనె వాడకాన్ని పది శాతం తగ్గించాలని ప్రధాని మోదీ భారత్‌తో పాటు ప్రపంచ దేశాల ప్రజలకు సూచించారు. ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుందని చెప్పారు. ‘ప్రపంచాన్ని స్థూలకాయం (ఒబేసిటీ) ఓ పెద్ద సమస్య వేధిస్తోంది. ఈ తరుణంలో యోగాతో పాటు వంట నూనెల వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఒబేసిటీని అదుపు చేయవచ్చు’ అని ప్రధాని వివరించారు.

ప్రకృతి, ప్రగతి సంగమం.. విశాఖ..
ప్రకృతి, ప్రగతి సంగమ స్థలి విశాఖపట్నం అని ప్రధాని మోదీ అభివర్ణించారు. విశాఖ ప్రజలు చాలా మంచి వారని కొనియాడారు. నెల రోజుల వ్యవధిలోనే విశాఖలో యోగా ఏర్పాట్లు పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్, అధికారులు విజయవంతమయ్యారని అభినందించారు. ప్రధాని మోదీ 19 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అంతర్జాతీయ యోగా డే పోస్టల్‌ స్టాంపును విడుదల చేశారు. 
మోదీ, చంద్రబాబు, పవన్‌లు యోగాసనాలు..
మరోవైపు ప్రధాని ప్రసంగం అనంతరం ఉదయం 7.10 గంటలకు ఆర్కే బీచ్‌లోని యోగా డే ప్రధాన వేదిక వద్ద ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లతో పాటు మంత్రి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణిలు కూడా యోగాసనాలు చేశారు. ప్రధాని సహా వీరంతా యోగా అభ్యాసకుల మధ్యలోనే యోగాసనాలు చేపట్టారు. 45 నిమిషాల సేపు యోగాసనాలు జరిగాయి. వేదికపై నుంచి యోగా శిక్షకుడు ఆసనాలను సూచిస్తుండగా వీరు ఆచరించారు. యోగాసనాలు ఓంకారంతో మొదలు పెట్టి ఓంకారంతోనే ముగించారు.
Tags:    

Similar News