యోగా జరుగుతుంటే..జగన్‌ "రఫ్పారఫ్పా" అంటున్నాడు

జగన్‌ రెంటపాళ్ల పర్యటన మీద, జగన్‌ చేసిన వ్యాఖ్యల మీద సీఎం చంద్రబాబు స్పందించారు.;

Update: 2025-06-19 12:28 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఒక వైపు యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతుంటే.. మరో వైపు రఫ్పా..రఫ్పా అని మాట్లాడుతున్నారని, చంపండి.. నరకండి అని ఎవరైనా మాట్లాడతారా? అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. గురువారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్‌ బుధవారం చేపట్టని రెంటపాళ్ల పర్యటన, మీద, గురువారం జగన్‌ చేసిన వ్యాఖ్యల మీద స్పందించారు. గాంజాయి, బెట్టింగ్‌ బ్యాచ్‌లు, రౌడీలకు ఎవరైనా విగ్రహాలు పెడతారా? అంటూ జగన్‌ను నిలదీశారు. ఇరుకుగా ఉన్న రోడ్లపైన, వీధుల్లో ఎవరైనా మీటింగ్లు పెడతారా? అలా ఇరుకు ప్రదేశాల్లో మీటింగ్లు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారా? అంటూ జగన్‌పై చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.

పర్యటనల పేరుతో హింసను ప్రోత్సహించి, పోలీసులపైనే నిందలు మోపుతారా? అంటూ నిలదీశారు. జగన్‌ చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడైనా ఉందా? అంటూ మండిపడ్డారు. నేరస్తులు రాజకీయాలు చేస్తే జగన్‌ మాదిరిగానే ఉంటుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించినట్లుగా తాము ఎవ్వరినీ టార్గెట్‌లు చేసి వారిపైన కేసులు పెట్టడం లేదని స్పష్టం చేశారు. తప్పులు చేశారు కాబట్టి శిక్షలు అనుభవిస్తున్నారు, చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అయినా రౌడీయిజం చేసిన వారిని, చట్టాలను ఉల్లంఘించిన వారిపైన కేసులు పెట్టకుండా వదిలేయాలా? అలాంటి వారు ఒక్క సారిగా ఉన్మాదులుగా మారితే భవిష్యత్‌లో వారిని మార్చగలమా? అంటూ మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో గత నెల 21 నుంచి ఈ నెల 21 వరకు యోగాంధ్ర పేరుతో యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, వీటని డైవర్ట్‌ చేసేందు, ప్రజలను డైవర్ట్‌ చేసేందుకు రఫా..రఫా అంటున్నారని జగన్‌పై మండిపడ్డారు. గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్లుగా నరికేస్తామని జగన్‌ అంటున్నారని.. ఒకప్పుడు చెడ్డ లక్షణాలు ఉన్న వ్యక్తిని రాజకీయాల్లో దూరం పెట్టేవారని, కానీ ఇప్పుడు అలాంటి వారినే వెనకేసుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు. తాము ప్రతిపక్షంలో ఉండగా పోలీసులు వద్దన్నప్పుడు ఎప్పుడైనా ఆ పని చేశామా? నిబంధనలకు విరుద్ధంగా వెళ్లామా? కానీ జగన్, ఆ పార్టీ నాయకులు పోలీసులకు, నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారని విమర్శలు గుప్పించారు.
తాను చేసిందే చట్టం అన్నట్లుగా గత ప్రభుత్వం, పాలకులు వ్యవహరించారని, అలా ఎంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న వైసీపీ వాళ్లైనా మారాలి.. ఏకుంటే ప్రజలు వారిని మార్చాలి అంటూ వైసీపీ మీద మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ వాళ్లు ప్రజలకు పెద్ద సమస్యగా మారారని, అన్ని నేరాల్లోను వాళ్లే ఉంటున్నారని ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉండే తన నియోజక వర్గం కుప్పంలో కూడా అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, తప్పుడు పనులతో ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నారు మండిపడ్డారు. నాగమల్లేశ్వరరావు వైసీపీ హయాంలోనే చనిపోయాడు.. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి పరామర్శకు వెళ్లిన జగన్‌కు, వైసీపీ నాయకుల వాహనం ఢీకొని ఓ వ్యక్తి చనిపోతే పట్టించుకోరా? అంటూ మండిపడ్డారు.
యోగా గురించి మాట్లాడుతూ.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ యోగా శిక్షణలు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. తొమ్మిదో తరగతి నుంచే విద్యార్థులు యోగా చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో యోగాంధ్ర కార్యక్రమం కోసం 2 కోట్ల మందిని టార్గెట్‌గా పెట్టుకుంటే అంతకు మించి 2.39 కోట్ల మంది రిజిస్ట్రేషన్‌లు చేయించుకున్నట్లు సీఎం చెప్పారు. 2,600 మంది యోగా ట్రైనర్లను నియమించాలనుకుంటే 5,451 మంది వచ్చారని, యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుందామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు జూన్‌ 21న ఏపీలో 1.30లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు జరుగుతాయని, ప్రపంచమంతా 8 లక్షల ప్రాంతాల్లో యోగాడేలో పాల్గొంటారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. కృష్ణా, గోదావరి నదీ జలాల వాడకంపైన, నీటి ప్రాజెక్టులపైనా సీఎం చంద్రబాబు స్పందించారు. సముద్రంలో కలిసే నీటిని వినియోగించుకుంటే సమస్యలు సృష్టించడం మంచిది కాదని, గోదావరి నదీ జలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలు వాడుకుంటున్నాయని  సీఎం చంద్రబాబు అన్నారు. నీటి వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు గొడవలు మంచిది కాదని సూచించారు. తెలంగాణపై తానెప్పుడూ గొడవలు పడలేదన్నారు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతామని సీఎం చంద్రబాబు అన్నారు. 
Tags:    

Similar News