యోగా డే సక్సెస్..జై టీడీపీ అన్న లోకేష్
యోగా డే విజయంవంతం చేసినందుకు కూటమికి బదులుగా టీడీపీ నాయకులు, శ్రేణులకు కృతజ్జతలు తెలిపిన మంత్రి లోకేష్.;
By : The Federal
Update: 2025-06-22 06:31 GMT
శనివారం వైజాగ్ ఆర్కే బీచ్లో నిర్వహించిన యోగా డేని కూటమి వర్గాలు, అధికారులు అందరూ కలిసే విజయవంతం చేశారు. ఇది ప్రభుత్వం చేపట్టిన కార్యాక్రమం అయినప్పటికీ దీనిని సక్సెస్ చేసేందుకు కూటమి భాగస్వామి పార్టీలైన తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీ శ్రేణులు పని చేశాయి. అయితే ఏపీ గవర్నమెంట్లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ మాత్రం యోగా డే విజయవంతం చేయడంలో కూటమి మాట ప్రస్తావించకుండా టీడీపీ ప్రస్తావన మాత్రమే చేయడంతో ఈ అంశం చర్చకు దారి తీసింది. లోకేష్ కూటమి మాట మరిచారా? కావాలనే టీడీపీ గురించి ప్రస్తావించారా? అనేది కూటమి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కలిసి కూటమిగా ఏర్పడి పని చేస్తున్నప్పుడు మిత్ర ధర్మాన్ని, పొత్తు ధర్మాన్ని పాటించాలి కదా అనే టాక్ కూటమి వర్గల్లో వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది. టీడీపీతో పాటు జనసేన, బీజేపీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఎన్నికల్లో సీట్లు కేటాయింపులు కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు పంపిణీ కానీ కూటమి వర్గాలు కలిసే పంచుకున్నాయి. రాజ్య సభ స్థానాల నుంచి నామినేటెడ్ పదవులు వరకు కలిసి మెలిసే పంచుకున్నాయి. అదేమాదిరిగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో శనివారం నిర్వహించిన యోగా డేని కూడా విజయవంతం చేయడంలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీలు కూడా పని చేశాయి. అయితే యోగా డేని సక్సెస్ చేయడంలో కూటమి పని చేసిందని చెప్పడానికి బదులుగా టీడీపీ మాత్రమే క్రియాశీలకంగా పని చేసిందన్నట్టుగా జై టీడీపీ లీడర్స్ అండ్ కేడర్ అని మంత్రి లోకేష్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా పేర్కొనడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపైన జనసేన, బీజేపీలు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది. 3,00,105 మంది పాల్గొని అరుదైన రికార్డును సాధించినట్లు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు ప్రశంసించిన ట్వీట్ను లింక్ చేస్తూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
లోకేష్ ఏమన్నారంటే..
బ్రాండ్ విశాఖపట్నం వేదికగా సరికొత్త ప్రపంపచ రికార్డు సాధించాం. ఈ విజయంలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులకు, ప్రభుత్వ అధికారులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.. జై టీడీపీ లీడర్స్ అండ్ కేడర్ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.