యోగా డే గ్రాండ్‌ సక్సెస్‌.. సూపర్‌ హిట్‌!

ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు సీఎం చంద్రబాబునాయుడు. ఒకేసారి రెండు గిన్నిస్, 21 వరల్డ్‌ రికార్డులు రావడం ఇదే తొలిసారి అన్నారు.;

Update: 2025-06-21 12:44 GMT
విశాఖలో మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్‌ యోగా డే గ్రాండ్‌ సక్సెస్, సూపర్‌ హిట్‌ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ యోగా డే విజయవంతం కావడంపై ప్రధాని మోదీ కూడా సంతోషం వ్యక్తం చేశారన్నారు. యోగా డే కార్యక్రమం అనంతరం శనివారం మధ్యాహ్నం విశాఖలో ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే?

‘విశాఖ వాసులు నాడు (హుద్‌హుద్‌ వేళ) దీపావళి వద్దంటే మానేశారు. నేడు యోగా డేకి రమ్మంటే తరలి వచ్చారు. విశాఖపట్నం అంటే నాకు ప్రత్యేక అభిమానం. హుద్‌హుద్‌లో ప్రజలు బాధలో ఉండి ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉంటారనుకుంటే అందుకు భిన్నంగా చంద్రబాబు ఆదుకుంటారనే నమ్మకంతో స్వాగతం పలికారు. తాను కూడా రెండుసార్లు సీఎంగా పనిచేసినా ఇలాంటి పరిస్థితిని చూడలేదని ప్రధాని మోదీ నాతో అన్న మాటలు మర్చిపోలేను. యోగా డే విజయవంతానికి అ«ధికారులు, ప్రజాప్రతినిధులు సంఘీభావంతో పనిచేశారు. ప్రజలు సహకరించారు. యోగాసనాల్లో 3,03,654 మంది పాల్గొన్నట్టు క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా గుర్తించారు. 22,122 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాలు సూర్యనమస్కాలు చేశారు. ఈ రెండూ గిన్నిస్‌ బుక్‌ రికార్డులు సాధించాయి. ఈ ఘనత సాధించిన గిరిజన పిల్లలను అభినందిస్తున్నాను. ఇవి కాకుండా మరో 21 యోగా విభాగాల్లో వరల్డ్‌ రికార్డులు సొంతమమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా యోగా డే వేడుకల్లో పాల్గొనడానికి 2.45 కోట్ల మంది రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. 2.17 కోట్ల మంది పాల్గొన్నారు. కానీ 1.80 కోట్ల మంది సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. 1.44 లక్షల మంది యోగా శిక్షకులుగా తయారయ్యారు. యోగా వల్ల ప్రయోజనం ఉందనే అంతమంది వచ్చారు. గ్రామీణ ప్రాంత వృద్ధ మహిళలు కూడా యోగా డేలో పాలు పంచుకోవడం గొప్ప విషయం. యోగా డే స్ఫూర్తిగా విశాఖపట్నం డిక్లరేషన్‌ తీసుకొస్తాం. భవిష్యత్తులో దీనివల్ల లాభాలేంటో తెలియజేస్తాం. యోగా, నేచురోపతి గేమ్‌ చేంజర్‌ అవుతుంది’ అని చెప్పారు.
ఆర్గానిక్‌ ఆహారమే తినండి..
‘రసాయనాలుండే ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన పంజాబ్‌.. పంటలకు ఎక్కువ పురుగుల మందు వాడడంతో క్యాన్సర్‌ రోగులు పెరిగి రోజూ ఢిల్లీకి వైద్యం కోసం ప్రత్యేక రైలులో వెళ్లి వస్తున్నారు. అందుకే ఆర్గానిక్‌ ఆహారం తినండి. అది తింటే ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి రాదు. రోజుకో గంట యోగా చేస్తే మీ కుటుంబానికి కూడా భారం కారు. యోగాను ప్రోత్సహించేలా కార్యాచరణ చేపడ్తాం. రాజకీయ నేతగా తాను అప్పుడూ ఇప్పుడూ టెక్నాలజీని ప్రమోట్‌ చేస్తున్నాను. టెక్నాలజీని అర్థం చేసుకోవడంలో ప్రధాని మోదీని మించిన వారు లేరు’ అని పేర్కొన్నారు.
విశాఖ ఉక్కును కాపాడాం..
‘విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రజల సెంటిమెంటు. దానిని కూటమి ప్రభుత్వం కాపాడింది. విశాఖ రైల్వే జోన్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పోలవరం పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి జరిగేలా వికేంద్రీకరిస్తున్నాం. విశాఖకు పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఐటీ పెట్టుబడులు వస్తున్నాయి. రాయలసీమలోనూ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. విశాఖకు మంచి భవిష్యత్తు ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలతో కలిసి ఎకనమిక్‌ కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం. విశాఖ మరో ముంబైలా తయారవుతుంది. ఈ న గరాన్ని ఎకనామిక్‌ హబ్‌గా చేస్తాం. దీనిపై కార్యచరణ రూపొందిస్తున్నాం. తిరుపతి కేంద్రంగా రాయలసీమ, అమరావతి కేంద్రంగా అక్కడ జిల్లాలను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం. వీటి ద్వారా ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. యువతకు హామీ ఇచ్చిన మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఆ దిశగా పని చేస్తాం.’ అని వివరించారు.
రాష్ట్రంలో నేరస్తులు తప్పించుకోలేరు..
‘కుప్పం లాంటి నియోజకవర్గంలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కొట్టేసి కొట్టడమేమిటి? ఇలాంటి ఘటనలను ఉపేక్షించను. ఈ రాష్ట్రంలో నేరాలు చేసి ఎవరూ తప్పించుకోలేరు. గతంలో తీవ్రవాదులపై ఎందుకు పోరాడాను. నాకు వారిపై వ్యక్తిగత విరోధమా? నా ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్నాను. రాయలసీమలో ముఠా నాయకులపై పోరాడి అణచి వేశాను. రౌడీలనే వారిని లేకుండా చేశాను. రాష్ట్ర బహిష్కరణ చేశాను’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
Tags:    

Similar News