మొన్న ‘బోట్ల’పైన..నేడు ‘కొండపల్లి ఖిల్లా’పైన

యోగాంధ్ర కార్యక్రమాల్లో రికార్డులను సొంతం చేసుకుంటున్న ఎన్టీఆర్‌ జిల్లా.;

Update: 2025-06-14 08:50 GMT

యోగాంధ్ర కార్యక్రమాలను వినూత్న రీతిలో నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్టీఆర్‌ జిల్లా ప్రత్యేకతను చాటుకుంటోంది. యోగాతో పాటు జిల్లాలో పర్యాటకానికి ప్రాచుర్యం కల్పించే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ రికార్టులను సొంతం చేసుకుంటోంది. ఇటీవల కృష్ణా నదిలో బోట్లపైన యోగాసనాలు ప్రదర్శించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం శనివారం ప్రముఖ చారిత్మ్రాతక, పర్యాటక ప్రదేశమైన కొండపల్లి ఖిల్లాపై యోగాసనాలు ప్రదర్శించి ప్రజల దృష్టిలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రముఖ చారిత్రాత్మక, పర్యాటక ప్రదేశమైన కొండపల్లి ఖిల్లాపై శనివారం యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అటు యోగాతో పాటు ఇటు కొండపల్లి ఖిల్లాకు ప్రాచుర్యం కల్పించేందుకు ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మే 21 నుంచి జూన్‌ 21 వరకు యోగా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం కొండపల్లి ఖిల్లాపై యోగా కార్యక్రమాలను నిర్వహించింది. జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశతో పాటు ఇతర జిల్లా అధికారులు, వందలాది మంది యోగా సాధకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్‌ లక్ష్మీశ స్వయంగా యోగా ఆసనాలు వేసి సాధకులకు స్పూర్తిగా నిలిచారు. జూన్‌ 21న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కలిగిస్తున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ ఆధ్వర్యంలో బుధవారం యోగాలో అరుదైన రికార్డు కూడా నమోదు చేశారు. విజయవాడ నగరానికి ఆనుకొని ఉన్న కృష్ణా నదీ తీరంలో యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. పర్యాటక ప్రదేశమైన బెరంపార్క్‌లో వివిధ రకాల బోట్లపై దాదాపు 2వేల మంది సాధకులు యోగాసనాలు ప్రదర్శించడంతో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. బోట్లు, స్పీడు బోట్లు, కయాక్స్‌ బోట్లు, శాండ్‌ బోట్లు, జెట్‌స్కీ, వంటి వివిధ రకాల వాటర్‌ క్రాప్ట్స్‌తో పాటు పున్నమిఘాట్‌లో ఏర్పాటు చేసిన తివాచీల మీద 2వేల మంది సాధకులు యోగాసనాలు ప్రదర్శించి అబ్బుర పరిచారు. స్వయంగా ఈ ఈవెంట్‌ను పరిశీలించిన వరల్డ్‌ రికార్డ్స్‌ యూనియన్‌(డబ్ల్యూఆర్‌యు) న్యాయనిర్ణేత షరీఫ్‌ హనీఫ్‌ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ రికార్టు సాధించినట్లు హనీఫ్‌ ప్రకటించారు. అందుకు సంబంధించిన సర్టిఫికేట్‌ను విజయవాడ కలెక్టర్‌ లక్ష్మిశ, జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియ, వీఎంసీ కమిషనర్‌ ధ్యానచంద్ర, ఎంపీ కేశినేని నాని, టూరిజమ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్, జీఏడీ పొలిటికల్‌ ముఖ్యకార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనాలకు అందజేశారు.

Tags:    

Similar News