ఉద్రిక్తంగా' అన్నదాత పోరుబాట'
వైసీపీ తలపెట్టిన అన్నదాత పోరుబాట నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.;
By : V V S Krishna Kumar
Update: 2025-09-09 06:29 GMT
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈరోజు తలపెట్టిన 'అన్నదాత పోరు'నిరసన కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉద్రిక్తతల మధ్య సాగుతోంది.ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పలు జిల్లాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ఉల్లి, టమోటా వంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షంగా వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకు వెళతామంటూ అన్ని జిల్లాల్లో ఆర్డీవో కార్యాలయాల వద్ద రైతులు, రైతు సంఘాలతో కలిసి ధర్నాలు చేపట్టింది. నిరసనల అనంతరం అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని పార్టీ అధిష్టానం శ్రేణులకు సూచించింది.అయితే ఆర్డీవో కార్యాలయాల వైపు వస్తున్న వైసీపీ శ్రేణులను పోలీసుు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 30 యాక్ట్ అమలులో ఉన్నందున ఎలాంటి సభలు, సమావేశాలకు ర్యాలీలకు అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆందోళనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా ఈ ఉదయం నుంచే పలువురు వైసీపీ ముఖ్య నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తున్నారు.పోలీసుల చర్యను వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ,శాంతి యుతంగా రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలన్న తమ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటున్నారు.వైసీపీ ముఖ్యనేతలను , ఎమ్మెల్యేలను ఇండ్ల నుంచీ బైటికి రానీయకుండా గృహ నిర్భందం చేయడం ఏంటని నిలదీస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్డీవో కార్యాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి వస్తున్న వైసీపీ శ్రేణులను అదుపులోనికి తీసుకుంటున్నారు. ఈ పరిణామాలతో పలు జిల్లాలలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా, నిర్బంధాలు విధించినా సరే 'అన్నదాత పోరు' కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని వైసీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.