రేవంత్ ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దుచేస్తుందా ?

రేవంత్ ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దుచేయాలని అనుకుంటుందా అని గ్రూప్-1 అభ్యర్ధుల్లో ఆందోళన పెరిగిపోతున్నట్లు చెప్పారు.

Update: 2024-10-19 12:00 GMT

తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దుచేయబోతోందా ? ఈ అనుమానాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యక్తంచేశారు. శనివారం సాయంత్రం గ్రూప్-1 అభ్యర్ధుల ఆందోళనలపై మీడియాతో మాట్లాడుతు రేవంత్ ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దుచేయాలని అనుకుంటుందా అని గ్రూప్-1 అభ్యర్ధుల్లో ఆందోళన పెరిగిపోతున్నట్లు చెప్పారు. గ్రూప్-1 మెయిన్ పరీక్షలు రాయబోయే అభ్యర్ధులంతా జీవో 29ని అనుమానిస్తున్నట్లు బండి చెప్పారు. ఎందుకంటే జీవో 29 లో రిజర్వేషన్లు తీసేశారని వేలాదిమంది అభ్యర్ధులు ఆందోళనలో ఉన్నట్లు కేంద్రమంత్రి గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు మద్దతుగా మాట్లాడిన రాహుల్, ప్రియాంకగాంధిలు ఇపుడు ఎందుకు జోక్యం చేసుకోవటంలేదని బండి నిలదీశారు.

ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు అలవిమాలిన హామీలిచ్చిన రేవంత్ ఇపుడేమో వాళ్ళని ఏమాత్రం పట్టించుకోవటంలేదని మండిపోయారు. నిరుద్యోగులు, గ్రూప్-1 అభ్యర్ధులను పట్టించుకోకపోగా ఆందోళన చేస్తున్న వారిపై లాఠీఛార్జి చేయించటం చాలా దారుణమని మండిపోయారు. అభ్యర్ధులైనా, బీజేపీ అయినా పరీక్షలను రద్దు చేయమని అడగటంలేదని, కేవలం పరీక్షలను రీషెడ్యూల్ చేయమని మాత్రమే అడుగుతున్నట్లు చెప్పారు. వేలాదిమంది అభ్యర్ధులు ఆందోళనతో ఉంటే ప్రభుత్వం కనీసం వాళ్ళని పిలిపించి మాట్లాడకపోవటం చాలా దారుణమన్నారు. అభ్యర్ధులు, నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం ఇదే పద్దతిలో వ్యవహరిస్తే తగిన గుణపాఠం తప్పదని బండి హెచ్చరించారు.

Tags:    

Similar News