ఎన్టీఆర్ జిల్లా గొంతెండిపోతున్నది, ఎందుకు?

కృష్ణా జిల్లాలో ఉన్నపుడు ఎన్టీఆర్ జిల్లా డెల్టా ప్రాంతం కానీ ఇప్పుడు మెట్ట ప్రాంతం. ఎందుకు ఇలా జరిగింది?;

Update: 2025-05-30 13:58 GMT
Prakasam Barrage (File Photo)

ఆంధ్రప్రదేశ్ విభజన ఎన్టీఆర్ జిల్లాను పూర్తి మెట్ట ప్రాంతంగా మార్చేసింది. ఒకప్పుడు డెల్టా ప్రాంతంగా ఉన్న కృష్ణా జిల్లా విడిపోగానే ఎన్టీఆర్ జిల్లా మెట్ట ప్రాంతంగా మారిపోవడం ఏమిటనే సందేహం ఎవరికైనా రావచ్చు. అప్పుడు, ఇప్పుడూ ఎప్పుడూ ఈ ప్రాంతం మెట్ట ప్రాంతమే. అయితే రాష్ట్ర విభజనకు ముందు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నందిగామ, తిరువూరు, మైలవరం నియోజకవర్గాలకు సాగునీరు అందేది. జిల్లాల విభజన తర్వాత పశ్చిమ ప్రాతం విజయవాడను కలుపుకుని ప్రత్యేక జిల్లా కావడంతో డెల్టా అనే పదాన్ని ఎన్టీఆర్ జిల్లాలో తొలగించాల్సి వచ్చింది. ఈ మార్పు ఎన్టీఆర్ జిల్లాలోని వ్యవసాయ, నీటిపారుదల రంగాలతో పాటు రాజకీయ నాయకులపై తీవ్ర ప్రభావం చూపింది. విజయవాడను జిల్లా పరిపాలనా కేంద్రంగా చేశారు. ఈ జిల్లా 2022 ఏప్రిల్ 4న కృష్ణా జిల్లా విభజించి ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పేరు పెట్టారు. రాష్ట్ర విభజన సరికి 11 సంవత్సరాలైనా పాలకులు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సాగర్ ఎడమ కాలువ నుంచి రావాల్సిన నీటి వాటాను తీసుకోవడంలో విఫలమయ్యారు. దీంతో ఎన్టీఆర్ జిల్లా మెట్టప్రాంతంగా మిగిలిపోయింది.

ఎన్టీఆర్ జిల్లా vs కృష్ణా జిల్లా

డెల్టా ప్రాంతం (కృష్ణా జిల్లా): కృష్ణా నది ద్వారా సమృద్ధిగా నీటిపారుదల సౌకర్యం ఉంది. ప్రకాశం బ్యారేజి ద్వారా 13.07 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు సరఫరా అవుతుంది. ఇది కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలను కవర్ చేస్తుంది. ఈ ప్రాంతంలో వరి ప్రధాన ఆహార పంటగా ఉంది. వ్యవసాయం సాగునీటి సమృద్ధి వల్ల అభివృద్ధి చెందింది. అయితే పదేళ్లుగా సాగునీటి కాల్వలు మరమ్మతులకు నోచుకోలేదు. కనీసం పూడికలు కూడా తీయడం లేదు.

మెట్ట ప్రాంతం (ఎన్టీఆర్ జిల్లా): ఎన్టీఆర్ జిల్లా ఎక్కువగా ఎత్తైన ప్రాంతంలో ఉంది. ఇక్కడ నీటిపారుదల ప్రధానంగా చిన్న చెరువులు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వంటి వనరులపై ఆధారపడుతుంది. కృష్ణా నది ఈ జిల్లాలో ప్రవహిస్తున్నప్పటికీ, డెల్టా ప్రాంతంతో పోలిస్తే సాగునీటి సౌకర్యం ఎన్టీఆర్ జిల్లాకు లేదు. 2019-20 లో ఎన్టీఆర్ జిల్లాలో స్థూల సాగునీటి ప్రాంతం 1.08 లక్షల హెక్టార్లు మాత్రమే. ఇది డెల్టా ప్రాంతంతో పోలిస్తే చాలా తక్కువ. రాష్ట్ర విభజనకు ముందు సాగర్ నీరు అందే ప్రాంతం రాష్ట్ర విభజన తరువాత పూర్తి మెట్టగా మారిపోయింది.


సాగర్ నీటిని పోరాడి సాధించాలి: ఇరిగేషన్ ఇంజనీర్ పాపారావు

సాగర్ నీటి పారుదల విషయంపై రిటైర్డ్ ఇరిగేషన్ చీప్ ఇంజనీరు కంభంపాటి పాపారావు మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు రెండు పంటలు సాగర్ నీటితో పండే ప్రాంతం ఎన్టీఆర్ జిల్లా. జిల్లా విడిపోవడాని ముందు రాష్ట్ర విభజన జరిగిన తరువాత సాగునీటిని సాగర్ ఎడమ కాలువ నుంచి రాకుండా తెలంగాణ రైతులు, అధికారులు కూడ బలుక్కుని చేశారు. దీంతో సాగర్ ఎడమ కాలువ ద్వారా ఎన్టీఆర్ జిల్లాకు రావాల్సిన సాగునీరు పూర్తిగా ఆగిపోయింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నది వాస్తవం. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని ఈ జిల్లాకు పూర్తి స్థాయిలో తీసుకు రావచ్చు. అలాగే పులిచింతల ప్రాజెక్టు నుంచి కూడా తీసుకురావొచ్చు కానీ గుంటూరు జిల్లా నుంచి కృష్ణానది దాటి నది ఎడమ వైపుకు నీరు రావాలి. అంటే తెలంగాణలోని నల్లగొండ జిల్లా ఇలాకాలోకి నీరు వచ్చిన తరువాత ఎన్టీఆర్ జిల్లాకు మళ్లించాల్సి ఉంటుంది. అందువల్ల చింతలపూడి నుంచి నీరు తెచ్చుకోవడం ఈజీగా ఉంటుందని చెప్పారు. కోర్టు ఆదేశాలతో ఆగిపోయిన ప్రాజెక్టును పునరుద్ధరించి పనులు ముందుకు నడిపించాలంటే ప్రభుత్వం తగిన చొరవ తీసుకోవాల్సి ఉందని అన్నారు.

ప్రస్తుతం గోదావరి నుంచి తీసుకొస్తామంటున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ప్రస్తుతం ఉన్న పట్టిసీమ కాలువలో కలపాలని చూస్తున్నారు. అదే జరిగితే తిరువూరు ప్రాంతంలో ఒక రిజర్వాయర్ నిర్మించి దానికి నీరు పెట్టాలి. అలా చేస్తే ఎన్టీఆర్ జిల్లాకు సాగునీరు అందించే అవకాశం ఉంది. మెట్టప్రాంతాలైన నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాలకు నీరు ఇవ్వాలంటే ఇది తప్పని సరి అని చెప్పారు. అలా కాకుండా బ్యారేజ్లో బనకచర్ల ప్రాజెక్టు నీరు కలిస్తే తిరిగి ఈ ప్రాంతాలకు ఇవ్వడం కష్టమని చెప్పారు. 2014-15తో తాను గోదావరి నీటిని సోమశిల లింక్ ద్వారా ఎలా ఎన్టీఆర్ జిల్లాకు అందించ వచ్చో చెప్పాను. దానిని పక్కన పెట్టారు. కారణాలు ఏమైనా అది కూడా మంచి సాగునీటి సోర్స్ అవుతుంది. నందిగామ, జగ్గయ్య పేట నియోజకవర్గాలకు సాగునీరు చేరాలంటే పైన మున్నేరు ఉంది. కింద ముత్యాల ఉంది. కృష్ణా రివర్ నుంచి ఎత్తిపోతల ద్వారా ఇవి నింప గలిగితే సాగునీటి కష్టాలు ఉండవని పాపారావు తెలిపారు.

ప్రాజెక్టుల అసంపూర్తి: నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు ఎన్టీఆర్ జిల్లాకు సాగు నీరు అందించాలి. కానీ సాగర్ నీరు అందే అవకాశాలు లేవు. పులిచింతల ప్రాజెక్టు ఇంకా అసంపూర్తిగానే ఉంది. చింతలపూడి ప్రాజెక్టు ప్రారంభ దశలోనే ఆగిపోయింది. చింతలపూడి ప్రాజెక్టును ఎంత త్వరగా పూర్తి చేయగలిగితే ఎన్టీఆర్ జిల్లాకు అంత తొందరగా సాగు నీరు అందుతుంది.

వనరుల కేటాయింపు: డెల్టా ప్రాంతంలోని కృష్ణా జిల్లాకు ప్రకాశం బ్యారేజి ద్వారా నీరు సమృద్ధిగా అందుతుండగా, ఎన్టీఆర్ జిల్లాకు ఇటువంటి సౌకర్యం లేకుండా పోయింది. రాష్ట్ర విభజనకు ముందు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నీరు అందుతున్నా ఇప్పుడు తెలంగాణ వారు ఆ నీటిని ఆపివేశారు. కాలువలు ఎండి పనికి రాకుండా పోయాయి.

విభజన ప్రభావం

ఎన్టీఆర్ జిల్లా మెట్ట ప్రాంతంగా మారడంతో సాగునీటి కొరత వల్ల వ్యవసాయం దెబ్బతిన్నది. డెల్టా ప్రాంతంలోని కృష్ణా జిల్లా సమృద్ధిగా నీటిని పొందుతుండగా, ఎన్టీఆర్ జిల్లా రైతులు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లా పరిపాలనా సౌలభ్యం పెరిగింది. కానీ నీటిపారుదల సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది.

ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు ద్వారా పరిపాలనా సౌలభ్యం మెరుగైనప్పటికీ, సాగునీటి కొరత, మెట్ట ప్రాంత భౌగోళిక పరిస్థితులు రైతులకు సవాళ్లను తెచ్చాయి. డెల్టా ప్రాంతంలోని కృష్ణా జిల్లాతో పోలిస్తే, ఎన్టీఆర్ జిల్లాలో నీటిపారుదల సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో ఎత్తిపోతల పథకాలు, స్థానిక నీటి నిల్వల నిర్మాణం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే, విజయవాడ పట్టణ ప్రాంతాలు వాణిజ్యంపై ఆధారపడితే, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు వంటి గ్రామీణ నియోజకవర్గాలు వ్యవసాయ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం రాజకీయ నాయకత్వం, ప్రభుత్వ చర్యలు కీలకం.


చింతలపూడి కాలువ

చింతలపూడి ఎత్తిపోతల పథకం

ఈ పథకం ద్వారా 53.50 టీఎంసీల గోదావరి వరద జలాలను ఉపయోగించి, 90 రోజుల పాటు 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు రైతులకు సాగునీరు పూర్తి స్థాయిలో అందించాల్సి ఉంది. సాగర్ ఆయకట్టులోని మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించడం ద్వారా ఈ ప్రాంతంలో వ్యవసాయ విస్తరణకు దోహదపడుతుంది.

జల్లేరు వాగుపై ఉన్న జలాశయ సామర్థ్యాన్ని 8 టీఎంసీల నుంచి 20 టీఎంసీలకు పెంచడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ పథకం ద్వారా ఎన్టీఆర్, గోదావరి జిల్లాలలోని మొత్తం 10 నియోజకవర్గాలు లోని వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలోని పలు మండలాలను కవర్ చేస్తుంది.

2009లో రూ.4,900 కోట్లతో ప్రారంభమైన ఈ పథకం ప్రస్తుతం రూ.9,547 కోట్ల వ్యయంతో రెండు ఫేజ్ లలో (ఫేజ్-1లో 15.50 టీఎంసీలు, ఫేజ్-2లో 38.00 టీఎంసీలు) నిర్మిస్తున్నారు. నాలుగు లిఫ్ట్ హౌస్ లు, 120 కిలోమీటర్ల కాలువలు ఈ పథకంలో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం నిధుల సమీకరణ, భూ సమీకరణ వివాదాలు, అటవీ భూములు, నష్టపరిహారం విషయంలో కోర్టు కేసుల వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. జూన్ 2028 నాటికి పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

చింతలపూడి పనులు తక్షణం చేపట్టాలి

ఈ ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి వేదిక కన్వీనర్ టి లక్ష్మినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు తీసుకోని కారణంగా గ్రీన్ ట్రిబ్యునల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తూ ఆదేశాలు జారీ చేసిందని, తిరిగి దీనిని పునరుద్ధరించుకునే పనులు చేపట్టక పోవడం దారుణమన్నారు. గతంలో చంద్రబాబు వైకుంఠపురం రిజర్వాయర్ కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 10శాతం లోపు జరిగిన పనులను నిలుపుదల చేశారు. దీంతో ఆ ప్రాజెక్టు అక్కడే ఆగిపోయింది. ఈ రిజర్వాయర్ కొంతవరకు మెట్ట ప్రాంతానికి ఇబ్బందులు లేకుండా పోతాయన్నారు.

ఇక పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్ ప్రాకారం వస్తే ఎన్టీఆర్ జిల్లాకు ఉపయోగం లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని నియోజకవర్గాలైన జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ నియోజకవర్గాలకు పై భాగాన కాలువ తీసుకొచ్చి పులిచింతల ప్రాజెక్టులో కలిపితే పై నియోజకవర్గాలకు నీరు ఇవ్వడంతో పాటు అక్కడి నుంచి కృష్ణానదిలోకి కలపడం ద్వారా రాయలసీమకు కూడా నీరు ఇవ్వవచ్చన్నారు లక్ష్మీనారాయణ


పులిచింతల ప్రాజెక్టు సామర్థ్యం

డాక్టర్ కెఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్టు అని దీనికి పేరు. ఈ బహుళార్థ సాగునీటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా నదిపై పల్నాడు జిల్లాలోని పులిచింతల గ్రామం సమీపంలో నిర్మించారు. ఇది ఎన్టీఆర్ జిల్లాతో సహా వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 13.08 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలి.

ఈ ప్రాజెక్టు 45.77 టీఎంసీ స్థూల నీటి నిల్వ సామర్థ్యంతో ఉంది. ఇందులో 36.23 టీఎంసీ లైవ్ స్టోరేజ్ (ఉపయోగపడే నీరు) ఉంది. ఇది 175 అడుగుల (53.34 మీటర్లు) ఫుల్ రిజర్వాయర్ లెవెల్ (FRL) వద్ద నీటిని నిల్వ చేస్తుంది. ప్రాజెక్టు వైకుంఠపురం బ్యారేజ్ (అమరావతి సమీపంలో) నాగార్జున సాగర్ డ్యామ్ మధ్య నిర్మించారు. ఇది 24 గేట్లతో ఉంది. వరద నియంత్రణ, సాగునీరు, జలవిద్యుత్ ఉత్పత్తి (30 మెగావాట్ల సామర్థ్యం) కోసం రూపొందించారు. 1911లో బ్రిటిష్ ఇంజనీర్ కల్నల్ ఎల్లిస్ ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా, ముఖ్త్యాల రాజా, మోటూరి సత్యనారాయణ, మరియు కెఎల్ రావు దీనిని ముందుకు తీసుకెళ్లారు. ఇది 2004లో జలయజ్ఞం కార్యక్రమం కింద ప్రారంభమై 2009లో ఆర్థిక ఒప్పందంతో నిర్మాణం మొదలైంది.

ఎన్టీఆర్ జిల్లాకు ఎలా ఉపయోగ పడుతుంది?

పులిచింతల ప్రాజెక్టు ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లోని వ్యవసాయ భూములకు సాగునీటిని అందించాలి. ఇది కృష్ణా డెల్టా లోని 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తుంది. ఇందులో ఎన్టీఆర్ జిల్లా ఒక ముఖ్యమైన భాగం.

ఈ ప్రాజెక్టు నీరు డౌన్ స్ట్రీమ్ లో ఉన్న ప్రకాశం బ్యారేజ్ కు సరఫరా చేస్తారు. అక్కడ నుంచి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లేదా పోలవరం కెనాల్ ద్వారా ఎన్టీఆర్ జిల్లా ఆయకట్టుకు చేరుతుంది.

తారకరామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా తిరిగి వచ్చే నీటిని ఉపయోగించి, ఎన్టీఆర్ జిల్లాలో 13,820 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తుంది. (లెఫ్ట్ మెయిన్ కెనాల్‌కు 9,000 ఎకరాలు, రైట్ మెయిన్ కెనాల్‌కు 4,820 ఎకరాలు).

2024 ఆగస్టు నాటికి నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు నీరు విడుదల చేశారు. ఇది ఎన్టీఆర్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో పంటల సాగుకు 15,000 క్యూసెక్స్ నీటిని విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు మూడు రోజుల్లో 45.77 టీఎంసీ సామర్థ్యంతో నిండిపోతుందని అంచనా వేశారు.

సవాళ్లు, పరిమితులు

2023లో నాగార్జున సాగర్ డ్యామ్ లో నీటి కొరత కారణంగా పులిచింతల ప్రాజెక్టులో కేవలం 13.66 టీఎంసీ నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఉపయోగ పడింది. దీని వల్ల ఎన్టీఆర్ జిల్లాలోని రైతులు పంటలు వేసుకోలేక పోయారు.

2021లో పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు వరదల ఒత్తిడి వల్ల ధ్వంసమైంది. దీని వల్ల 1.6 లక్షల క్యూసెక్స్ నీరు వృథా అయింది. ఇటువంటి సమస్యలు ఎన్టీఆర్ జిల్లాతో సహా డౌన్ స్ట్రీమ్ ప్రాంతాలకు నీటి సరఫరాను తాత్కాలికంగా అడ్డుకున్నాయి.

పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేయడానికి భూమి సేకరణ పూర్తి కావాల్సి ఉంది. ఇది ఇంకా పూర్తి కాలేదు. దీని వల్ల 2018లో కేవలం 30 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ చేశారు. ఇది ఎన్టీఆర్ జిల్లా ఆయకట్టుకు నీటి సరఫరాను పరిమితం చేసింది.

కృష్ణా నదిలో నీటి కొరత సమయాల్లో, పోలవరం లేదా పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి నీటిని పులిచింతల రిజర్వాయర్ కు మళ్లించడం జరుగుతుంది. ఇది ఎన్టీఆర్ జిల్లా ఆయకట్టుకు సహాయపడుతుంది. కానీ ఇంతవరకు జరగలేదు.

పాలకులు సిగ్గుపడాలి: కెవివి

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఎన్టీఆర్ జిల్లా పరిస్థితి ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ అన్నారు. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న కృష్ణా డెల్లా ప్రాంతంలో ఎన్టీఆర్ జిల్లాకు సాగర్ నీరు అందించలేకపోవడం సిగ్గు చేటని అన్నారు. ఒక వైపు గోదావరి, రెండో వైపు కృష్ణా నది ఉన్నా ఎన్టీఆర్ జిల్లాకు సాగునీరు అందక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తీసుకోవాల్సిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. తెలంగాణకు చెందిన రైతులు, అధికారులు కలిసి నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి రావాల్సిన సాగు నీరు ఎన్టీఆర్ జిల్లాకు అందకుండా చేశారన్నారు. దాములూరు-వైకుంఠపురం ప్రాజెక్టు ద్వారా ఎన్టీఆర్ జిల్లాను సస్యశ్యామలం చేయవచ్చని, అయినా పాలకులుపట్టించుకోవడం లేదన్నారు. అందుకే నేడు జిల్లా మెట్ట ప్రాంతంగా మారిపోయిందన్నారు. గతంలో సాగర్ ఎడమ కాలువ నీరు వచ్చేది. ఇప్పుడు ఆగిపోయింది. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీకి తెలుసు అయినా పట్టించుకోలేదని అన్నారు. ఇది ప్రభుత్వాల మధ్య ఏర్పడిన అగాధంగా వర్ణించారు. గతంలో మాదిరి ఆయకట్టుకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం పాలకులపై ఉందన్నారు. రైతు సంఘాల ప్రతినిధిలో ఏపీ నుంచి ఏకమై ఇందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News