ప్రజల ప్రాణాలు తీసే హక్కు జగన్కు ఎవరిచ్చారు
జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య మృతి చెందాడనే వైరలవుతున్న వీడియో మీద షర్మిల స్పందించారు.;
By : The Federal
Update: 2025-06-22 13:12 GMT
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన, ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో సారి ధ్వజమెత్తింది. జగన్ రెంటపాళ్ల పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద సింగయ్య అనేక వ్యక్తి మరణించినట్లు వైరల్ అవుతున్న వీడియో మీద ఆమె స్పందించారు. కారు కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు ఒళ్లు గగుర్పాటు కలిగించే విధంగా ఉన్నాయన్నారు. కారు కింద వ్యక్తి పడిపోయారన్న సోయ లేకుండా జగన్ తన కాన్వాయ్ని ముందుకు వెళ్లడం ఏంటని ఆమె ప్రశ్నించింది. పోలీసులు వంద మందికి అనుమతులిస్తే కారు సడ్ బోర్డు మీద నిలబడి జగన్ వేల మంది ముందు చేతులు ఊపడం ఏంటని నిలదీశారు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య మరణం పట్ల జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని జగన్ను ప్రశ్నించారు. బెట్టింగ్లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలిస్తారా? ఇదేం రాజకీయం? ఇదెక్కడి ఆనందం? మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా? ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా? కార్ సైడ్ బోర్డు మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా? ఇది పూర్తి జగన్ బాధ్యత రాహిత్యానికి అద్దం పడుతోందని విమర్శలు గుప్పించారు.
బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్ గారు, 100 మందికి అనుమతి ఇచ్చి వేల మందితో వచ్చినా దగ్గరుండి మరి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. పర్మిషన్ కి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారు ? ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు ? ఎందుకు ఇంటలిజెన్స్ వ్యవస్థను నిద్ర పుచ్చారు ? ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? కాంగ్రెస్ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌజ్ అరెస్ట్ లు చేస్తారు. దీక్షలను భగ్నం చేస్తారు. ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారు. వైసీపీ చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు జగన్ ఏం సమాధానం ఇస్తారు ? కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది ? ఏం చర్యలు తీసుకుంటున్నారు ? అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.