మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. మంత్రుల సబ్ కమిటీ తొలి సమావేశం

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నియంత్రణకు మంత్రులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈరోజు జరిగిన కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Update: 2024-07-04 11:36 GMT

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను సమూలంగా నివారించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా ఇదే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. క్యాబినెట్ అందరి సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం వీటి నియంత్రణ కోసం ముగ్గురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత వహిస్తున్నారు. ఈ కమిటీ తొలి సమావేశం ఈరోజు జరిగింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ మాదకద్రవ్యాల ప్రభావం ఎక్కువగా ఉంది. యువతపై వీటి ప్రభావం ఎంతగా ఉంది. అసలు రాష్ట్రంలోని మాదక ద్రవ్యాలు ఎలా ప్రవేశిస్తున్నాయి వంటి పలు అంశాలపై వారు చర్చించారు. ఈ కమిటీలో అనితతో పాటు ఐటీ మంత్రి నారా లోకేష్‌, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర, వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కూడా ఉన్నారు. ఈ సమావేశంలో వారంతా కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనిత, సంధ్యారాణి కలిసి వెల్లడించారు.

‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నిశ్చయించాం. అందుకు అనుగుణంగా నిర్ణీత ప్రణాళిక ప్రకారం కృషి చేయవలసిన బాధ్యత మనపై ఉంది. యువత మాదక ద్రవ్యాలకు బానిసైతే వారి భవిష్యత్తుకు, కుటుంబాలకు కూడా తీరని నష్టాన్ని కొనితెచ్చుకుంటుంది. వారి భవిష్యత్తు కోసం గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణాను నియత్రించేందుకు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్‌ను నియమించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేస్తాం’’ అని ఆమె వెల్లడించారు.

రెండేళ్లుగా అనుమతుల్లేవ్

‘‘గంజాయి పంటను నాశనం చేయడానికి గత రెండు సంవత్సరాలుగా సెబ్ కు ఎటువంటి అనుమతి ప్రభుత్వం ఇవ్వలేదు. గంజాయి సాగుకు పెట్టుబడి పెట్టే, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మత్తు పదార్థాల అలవాటును నియంత్రించే డి-అడిక్షన్ కేంద్రాలు, పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. పాఠశాల దశ నుంచే విద్యార్దులకు గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తాం’’ అని వివరించారు.

ఎక్కువ మంది మైనర్లే

‘‘రాష్ట్రంలో నమోదైన మాదకద్రవ్యాల కేసుల్లో ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తున్నవారిలో అత్యధికం మైనర్లే ఉన్నారు. ఇది అత్యంత బాధాకరం. గంజాయి సాగుకు పెట్టుబడులు ఎవరు పెడుతున్నారు, డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వచ్చిన వారు ఎవరనే దానిపై నిఘా ఏర్పాటు చేస్తాం. ముందుగా వంద రోజులలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కృషి చేస్తాం. గంజాయి సాగుపై సమాచారం ఇచ్చిన వారికి ప్రభుత్వం తరఫున తగిన బహుమతులు కూడా అందిస్తాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగానే ఉంచుతాం’’ అని వెల్లడించారు.

నియంత్రణ అత్యవసరం

మాదకద్రవ్యాల నిర్మూలన అనేది అనుకున్నంత సులభంగా జరిగేది కాదని, అది దీర్ఘకాల ప్రక్రియ అని రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వివరించారు. కానీ నియంత్రణ అత్యవసరంగా చేపట్టాల్సిన ప్రక్రియన అని కూడా చెప్పారామే. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో గంజాయి సాగు, వినియోగం వల్ల కలిగే దుష్పపరిణామాలను గిరిజనులకు అర్థమయ్యేలా వివరించాలని, వారికి దీనిపై అవగాహన కల్పించాలని ఆమె చెప్పారు. అదే విధంగా ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో కాఫీ,అల్లం, చింతపండు,పసుపు వంటి పంటలను మాత్రమే సాగు చేయాలని మంత్రి సంధ్యారాణి అన్నారు.

గత ప్రభుత్వ చర్యలు ఒక కారణం

‘‘ప్రలోభాలకు గురైన గిరిజనులు గంజాయి సాగు చేయడానికి గత ప్రభుత్వం ఐటీడిఏలను నిర్వీర్యం చేయడం కూడా ఒక కారణం. గిరిజనులు వారి పిల్లలను మంచి పౌరులుగా తయారు చేయడానికి వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్య బుద్ధులు నేర్పించాలి’’ అని గిరిజన ప్రజలకు విజ్ఞప్తి చేశారు సంధ్యారాణి. ‘‘ఎవరి పిల్లలైనా గంజాయి మత్తుకు బానిసలై ఉంటే ఎటువంటి భయం లేకుండా సంబంధిత అధికారులకు తెలియజేయండి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతూనే అధికారులు వారికి కావాల్సిన సహకారం అందిస్తారు’’ అని తెలిపారామే.

Tags:    

Similar News