కూర్మ వైదిక గ్రామ ఘటనపై పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే

సనాతన ధార్మిక జీవనం కోసం ఇస్కాన్‌ ఆధ్వర్యంలో ఈ గ్రామం ఏర్పాటైంది.;

Update: 2025-06-14 10:49 GMT

శ్రీకాకుళం జిల్లా హీరమండలం కూర్మ వైదిక గ్రామంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమని, ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. కూర్మ గ్రామంలో ప్రస్తుత పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని శనివారం సోషల్‌ మీడియా వేదికగా పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే..
ఆధునిక హంగులు లేకుండా అధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్న కూర్మ గ్రామం అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరం. శ్రీకాకుళం జిల్లా హీరమండలం సమీపంలోని కూర్మ గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై పోలీసులు లోతుగా విచారణ చేయాలని సంబంధిత యంత్రాంగానికి సూచనలు చేశాను. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టాలి. కూర్మ గ్రామంలో ప్రస్తుత పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాము.
సనాతన ధార్మిక జీవనం కోసం ఇస్కాన్‌ ఆధ్వర్యంలో ఈ గ్రామం ఏర్పాటైంది. కూర్మ గ్రామవాసులు యాంత్రిక జీవన విధానాలకు భిన్నంగా మట్టి ఇళ్ళల్లో ఉంటూ ప్రకతి వ్యవసాయం చేసుకొంటూ జీవిస్తున్నారు. వేద విద్యను అభ్యసించే చిన్నారులు సంస్కృతం, తెలుగు, హిందీ, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. వర్తమాన కాలంలో విశిష్టంగా ఉన్న ఈ గ్రామం పునరుద్ధరణపై దృష్టి సారించాలి. అంటూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా హీరమండలం పరిధిలోని కూర్మ వైదిక గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో పర్ణశాల దగ్ధమైంది. ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో ఆశ్రమంలోని వాసులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. అయినా అదుపులోకి రాకపోడంతో కొత్తూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కూర్మ పర్ణశాలతో పాటు అందులో ఉన్న వస్తువులు కూడా మంటల్లో బూడిదయ్యాయి. ఈ ప్రమాద ఘటనలో దాదాపు రూ. 40లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంపైన స్థానిక స్వామిజీ నరోత్తమ ప్రభుదాస్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎవరో కావాలనే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు తన ఫిర్యాదులో వ్యక్తం చేశారు. కొండల ప్రాంతంలో ఉన్న వైదిక గ్రామానికి రక్షణ కల్పించి భద్రత పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.
Tags:    

Similar News