దశాబ్దాల పాలనా అనుభవం ఏమైంది చంద్రబాబు

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం కావస్తుండటంతో కూటమి చేస్తున్న అప్పులు మీద మాజీ సీఎం జగన్‌ ఆందోళనలు వ్యక్తం చేశారు.;

Update: 2025-06-02 11:06 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులు మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళనలు వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఊబిలోకి సీఎం చంద్రబాబు నెట్టేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించింది ఏంటి? అని ప్రశ్నించారు. దశాబ్దాల అనుభవం ఉంది, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశా.. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడం నా వల్లే అవుతుందని చెప్పుకునే సీఎం చంద్రబాబు ఆ అనుభవం అంతా ఎటుపోయింది? ఏమైపోయింది? అంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. అంత అనుభవం కలిగిన మీరు నాలుగో సారి ముఖ్యమంత్రిగా పీఠమెక్కిన తర్వాత.. ఈ ఏడాది పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను ఏ మేరకు అభివృద్ధి చేశారు? మీ పాలన అనుభవం రాష్ట్రానికి ఏమిచ్చింది? అంటూ నిలదీశారు. ఐదేళ్ల తమ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల్లో 44 శాతం అప్పులు కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఈ ఏడాది కాలంలో చేశారని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆ మేరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం కావచ్చిందని, సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేయడమే కాకుండా సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ చేసిందేమీ లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మేరకు సోమవారం ఎక్స్‌ వేదికగా జగన్‌మోహన్‌రెడ్డి ఓ పోస్టు పెట్టారు.
కూటమి ఆర్థిక విధానాలు సరిగా లేవని, ఈ విషయాలను కంట్రోల్‌ అండ్‌ ఆడిట్‌జనరల్‌(కాగ్‌), జాతీయ గణాంక కార్యాలయం(ఎంఓఎస్‌పీఐ)గణాంకాలే దీనికి నిదర్శనమని జగన్‌ విమర్శలు గుప్పించారు, ప్రముఖ సంస్థలు పేర్కొంటున్న ఈ లెక్కలే కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు పాలన అసమర్థతలను, వారి ఆర్థిక విధానాలను తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొన్నారు.
స్థూల రాష్ట్ర దేవీయోత్పత్తి(జీఎస్‌డీపీ)లో గతంలో ఆర్థిక లోటు అనేది 4.08 ఉంటే అదిప్పుడు 5.12 శాతానికి పెరిగిందని, జీఎస్‌డీపీలో రెవిన్యూ లోటు గతంలో 2.65 శాతం ఉంటే అదిప్పుడు ఏకంగా 3.61 శాతనికి పెరిగి పోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేనప్పటికీ, కరోనా వంటి ఇబ్బందికర పరిస్థితులు లేనప్పటికీ రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో ఏకంగా 35.64 శాతానికి చేరుకున్నాయని, ఇది చాలా ఆందోళనకరమైన అంశంగా తాను పరిగణిస్తున్నట్లు జగన్‌ వెల్లడించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు మేల్కోవాలన్నారు. అసమర్థత ఆర్థిక విధానాలను పక్కన పెట్టాలన్నారు. ఆర్థిక పరమైన క్రమశిక్షణ పాటించాలన్నారు. అలా పాటించని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. 

Tags:    

Similar News