టోకెన్లు లేకున్నా వైకుంఠ ద్వార దర్శనం!

డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకూ తిరుమలలో విస్తృత ఏర్పాట్లు

Update: 2025-12-15 13:07 GMT
డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకూ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వైకుంఠ ద్వార దర్శనాలకు ఈసారి మరింత విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తిరుమలలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మొదటి మూడు రోజులకు ఎలక్ట్రానిక్ లక్కీడిప్ ద్వారా టోకెన్లు కేటాయించినట్లు తెలిపారు. అయితే మిగతా ఏడు రోజుల పాటు టోకెన్లు లేకపోయినా, సామాన్య భక్తులకు సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాట్లు, సేవలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. దాత మంతెన రామలింగరాజు సహకారంతో పీఏసీలను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఇటీవల ఆయన రూ.9 కోట్ల విరాళం అందించినట్లు వెల్లడించారు.
ఆలయ ధ్వజస్తంభాల కోసం అవసరమైన దివ్య వృక్షాలను టీటీడీ స్వయంగా పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం 100 ఎకరాల్లో వృక్షారోపణ చేయాలని భావిస్తున్నామని, పలమనేరులోని టీటీడీ గోశాల ఆవరణాన్ని ఇందుకు అనువైన ప్రదేశంగా గుర్తించినట్లు చెప్పారు.
మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరగనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో 50 అజెండా అంశాలపై చర్చ జరగనుందని, దివ్య వృక్షాల ప్రాజెక్టుపై కూడా పాలకమండలి తుది నిర్ణయం తీసుకుంటుందని బీఆర్ నాయుడు తెలిపారు.
Tags:    

Similar News