రేణిగుంట విమానాశ్రయానికి పేరు మార్పు!
శ్రీవేంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని కేంద్రానికి టీటీడీ సిఫార్సు.;
By : V V S Krishna Kumar
Update: 2025-06-17 13:21 GMT
తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి శ్రీవేంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడంతో పాటు, తిరుమలకు ఐకానిక్ గా విమానాశ్రయానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చేందుకు కేంద్ర విమానయానశాఖకు సిఫార్సు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం టీటీడీ ధర్మ కర్తల మండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
-బెంగుళూరులోని ప్రధాన ప్రాంతంలో శ్రీవారి ఆలయం నిర్మించాలని నిర్ణయం.కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంల అభ్యర్థన మేరకు ఇందుకు కావాల్సిన 47 ఎకరాల స్థలాన్ని కర్ణాటక ప్రభుత్వం కేటాయించగానే ఆలయం నిర్మించేందుకు చర్యలు.
- త్వరలోనే తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకు వచ్చేందుకు చర్యలు.
కేంద్ర ప్రభుత్వం నుండి టీటీడీకి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించేందుకు అంగీకరించిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డీ.కుమార స్వామి.
- కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో ఏర్పాటు చేయనున్న సీఎస్ఐఆర్ ల్యాబ్ కు లీజు పద్ధతిలో టీటీడీ స్థలాన్ని కేటాయించాలని నిర్ణయం. టీటీడీ వినియోగించే నెయ్యి, నీరు, ఆహార పదార్థాల నాణ్యతను ఉచితంగా తనిఖీ చేసేందుకు అవకాశం.
- న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక టీటీడీ కళాశాలను ఆధునీకరించాలని నిర్ణయం.
- టీటీడీలోని లెక్చరర్ పోస్టుల భర్తీని నిలిపివేయాలని ఏపీపీఎస్సీకి సిఫార్సు. ఇప్పటికే పని చేస్తున్న 200 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు.
- సమరసతా సేవా ఫౌండేషన్ సహకారంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న అర్చకుల శిక్షణా కార్యక్రమంతో పాటు వివిధ వ్రతాలు, పూజా విధానాలలో కూడా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం.
- విద్యార్థుల్లో హైందవ సనాతన ధర్మం నేర్పిన మానవీయ విలువలను, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వడానికి సద్గమయ కార్యక్రమాన్ని టీటీడీకి చెందిన ఏడు పాఠశాలల్లోని దాదాపు 1600 మంది విద్యార్థులకు డే స్కాలర్ విధానంలో శిక్షణ.
- టీటీడీ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు హిందూ సనాతన ధార్మిక విలువలతో పాటు తెలుగు సాంస్కృతిక వైభవంలో శిక్షణ ఇవ్వడంలో భాగంగా మన వారసత్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం.
- వరలక్ష్మీ వ్రతం పర్వదినాన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సౌభాగ్యం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం.
- అక్షర గోవిందం, హరికథా వైభవం, భగవద్గీత అనుష్టాన బోధన, భజే శ్రీనివాసం, వన-నిధి, గిరి జనార్దనం, సన్మార్గం వంటి కార్యక్రమాలను నిర్వహించి జన బాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు చర్యలు.
టీటీడీ ధర్మ కర్తల మండలి సమావేశంలో బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, తమ్మిశెట్టి జానకీ దేవి, నరేష్, సదాశివరావు, శాంతా రామ్, రామ్మూర్తి,దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.