అడవి బిడ్డల ‘యోగ’ చాట్లు!
గిన్నిస్ బుక్లో నమోదుకు 36 గంటలకు పైగా ప్రయాసలకోర్చారు. అష్టకష్టాలు పడి ప్రతిష్టాత్మక ప్రపంచ రికార్డును తెచ్చిపెట్టారు.;
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-06-22 10:34 GMT
విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి లక్షలాది మంది తరలి వచ్చారు. గిన్నిస్ బుక్లో నమోదు కోసం వీరందరినీ ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి తోలుకొచ్చారు. వీరందరికీ రానూపోనూ బస్సులను, ఇతర వాహనాలనూ సమకూర్చారు. ప్రయాణ సమయం పోను ఓ రెండు గంటల సేపు యోగాసనాలకు కేటాయించారు.
గ్రౌండ్లో నేలపైనే నిద్రిస్తున్న గిరిజన బాలికలు
కానీ ఈ యోగా వేడుకల్లో అడవి బిడ్డల పాత్ర అంతా ఇంతా కాదు.. అందుకోసం వారు పడ్డ అగచాట్లూ అన్నీ ఇన్నీ కావు. ఈ యోగా డే నాడు రెండు గిన్నిస్ రికార్డులను సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో విశాఖ వేదికగా ఐదు లక్షల మందితో యోగాసనాలు చేయించడం ఒకటి. 25 వేల గిరిజన విద్యార్థినీ, విద్యార్థులతో ఒకేసారి సూర్య నమస్కారాలు చేయించడం మరొకటి. షెడ్యూలు ప్రకారం గిన్నిస్ రికార్డు కోసం ఈనెల 21న జరిగే యోగా డే నాడు ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో గిరిజన పిల్లలతో సూర్య నమస్కారాలు చేయించాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా మంత్రులు అందుబాటులో ఉన్నారని ఆ షెడ్యూలును 20వ తేదీ సాయంత్రానికి మార్పు చేశారు. దీంతో ఒకరోజు ముందుగా అంటే 20 వేకువజామునే ఈ పిల్లలందరినీ బయల్దేరించి మధ్యాహ్నానికి ఏయూ గ్రౌండ్కు తీసుకొచ్చారు. భోజనాలు పూర్తయిన కొద్ది సేపటికే సూర్య నమస్కారాల ప్రక్రియకు అధికారులు వీరిని సిద్ధం చేశారు. వాస్తవానికి యోగాసనాలు ఖాళీ కడుపుతో లేదా భోజనం తిన్నాక కనీసం నాలుగ్గంటల తర్వాతైనా చేయాలి. కానీ రెండు గంటల వ్యవధి లేకుండానే సూర్య నమస్కారాలు చేయించారు. ఇలా 22,122 మంది గిరిజన పిల్లలు 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ బుక్ రికార్డును సాధించారు. ఇటు రాష్ట్రానికి, అటు కేంద్రానికి కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టారు ఈ గిరిజన బిడ్డలు.
వసతి సదుపాయ కోసం ఎదురు చూపులతో..
అగచాట్లు పడ్డారిలా..
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసమని ఇంతలా వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఈ గిరిజన పిల్లలు చాలా అవస్థలే పడ్డారు. శుక్రవారం (20) సాయంత్రం సూర్య నమస్కారాల తర్వాత వీరిని అంతగా పట్టించుకున్న వారే లేకుండా పోయారు. దీంతో అర్థరాత్రి వరకు వీరంతా తాము సూర్య నమస్కారాలు చేసిన గ్రౌండ్లోనే ఉండిపోయారు. చాలా మంది ఎక్కడి వారక్కడే కునుకుతీశారు. విషయం మీడియా దృష్టికి వెళ్తుందని తెలిసి అధికారులు అర్థరాత్రి వేళ అప్పటికప్పుడు వీరిని వేరొక చోటకు తరలించారు. ఆ మర్నాడు 21న ఉదయం జరిగే ప్రధాన యోగా డే వేడుకలకు సిద్ధం కావడానికి వీరిని మళ్లీ వేకువజామునే నిద్ర లేపారు. అరకొరగా నిద్రపోయినా అంకితభావంతో వీరు నిర్ణీత సమయానికే ఏయూ గ్రౌండ్కు చేరుకున్నారు. ఆర్కే బీచ్లో వేడుకలకు సమాంతరంగా వీరు ఈ మైదానంలో యోగాసనాలు చేశారు. అయితే ముందు రోజు, యోగా డే నాటి ఉదయం వీరికి సరైన తిండి సమకూర్చలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వారికి సరైన వసతి, మరుగుదొడ్ల సదుపాయం, తిండి లేకపోయినా సర్దుకుపోయారు తప్ప తమకు ఎదురైన ఇబ్బంది, తాము పడ్డ అవస్థలపై రోడ్డెక్కలేదు. వీరు తమ స్వస్థలాలకు వెళ్లిపోవడానికి అధికారులు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అప్పటికే ఆకలితో ఉన్న ఈ పిల్లలు తమకు అందుబాటులో ఉన్న వాటర్ బాటిళ్లను నెత్తిన పెట్టుకుని తిరుగు పయనమయ్యారు.
వసతి లేక బస్సులోనే రాత్రి నిద్రిస్తూ..
200 కి.మీల నుంచీ వచ్చారు..
విశాఖపట్నానికి అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరం నుంచి అరేడు గంటలు ప్రయాణించి వచ్చిన వారూ ఉన్నారు. దీంతో ముందు రోజు తెల్లవారుజామునే బయల్దేరిన వారు తిరిగి మళ్లీ తమ స్వస్థలాలకు రెండో రోజు సాయంత్రానికి చేరుకున్నారు. అంటే దాదాపు 36 గంటల పాటు వీరు యోగా డే కోసం వెచ్చించారన్న మాట! అదే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఏడెనిమిది గంటలకు వారిళ్లకు చేరుకున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలిః పీడీఎస్యూ
గిరిజన పిల్లలను యోగాసనాలకు తీసుకెళ్లి ఇబ్బందులు పాల్జేసిన బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పీడీఎస్ఓ) డిమాండ్ చేసింది. ప్రపంచ రికార్డుల కోసం వీరిని ఉపయోగించుకుని తగిన భోజన, వసతి సదుపాయాలు కల్పించకపోవడం దారుణమని సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరపాలన్నారు.
అంచనాలను అందుకోలేదు..
తొలుత ఐదు లక్షల మందితో యోగాసనాలు చేయించి ప్రపంచ రికార్డు కొల్లగొడ్తామని పాలకులు ప్రకటించారు. తీరా యోగా డే పూర్తయ్యాక ఆ సంఖ్య మూడు లక్షలకు మించలేదు. అయినప్పటికీ లెక్కల ప్రామాణికంగా గిన్నిస్ రికార్డు దక్కింది. అదెలా అంటే? ఇప్పటివరకు గుజ రాత్ సూరత్లో 2023 సంవత్సరంలో 1.47 లక్షల మందితో నిర్వహించిన యోగాసనాలే గిన్నిస్ రికార్డు. అందువల్ల ఆ సంఖ్యకంటే ఒక్కరు ఎక్కువగా చేసినా ఆ రికార్డు బద్దలవుతుంది. పాలకులు, అధికారులు నెల రోజులుగా ఊదరగొడుతున్నట్టు ఐదు లక్షలకు బదులు మూడు లక్షల మందే యోగాసనాల్లో›్ల పాల్గొన్నారు. దీంతో అంచనాలకు ఇంకా రెండు లక్షల మంది తక్కువగానే హాజరయ్యారు. అయినా యోగా డే సూపర్ సక్సెస్ అని ప్రకటించుకున్నారు.