TIRUMALA || శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..!
ఆలయం సుగంధ పరిమళ జలాలతో శుద్ధి;
By : Dinesh Gunakala
Update: 2025-07-15 07:19 GMT
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయ శుద్ధి కార్యక్రమం చేయడం ఆనవాయితీ.
శ్రీవారి ఆలయంలో టిటిడి చైర్మన్ బి. ఆర్ నాయుడు తో పాటు ఈఓ శ్యామలరావు, ఆలయ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఏడాదిలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానం, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు మంగళవారం ఆలయ శుద్ధి చేయడం ఆనవాయితీగా వస్తోంది.
(ఏమి చేస్తారంటే )
శ్రీవారి ఆలయంలోని పూజసామగ్రి, ఇతర ఉప ఆలయాలు, ఆలయ గోడలను సుగంధ ద్రవ్యాల పరిమళంతో శుద్ధి చేసి. ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ముగించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు, నివేదనలు సమర్పించి అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు.
(కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే?)
తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి ఏటా 450కిపైగా ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తున్నారు. అందులో అత్యంత పవిత్ర కైంకర్యమే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. కోయిల్ ఆళ్వారు తిరుమంజనం అంటే. తమిళంలో కోయిల్ అంటే కోవెల (గుడి) అని, ఆళ్వారు అంటే భక్తుడు అని అర్థం. భక్తుని హృదయ స్థానంలో భగవంతుడు ఉన్నట్టే కోవెలలో భగవంతుడు కొలువై ఉంటాడు. పవిత్ర గర్భాలయ స్థానాన్ని సంప్రదాయ, వైఖానస ఆగమోక్తంగా శుద్ధి చేసే కైంకర్యమే కోయిల్ ఆళ్వారు తిరుమంజనం.
( మహాయజ్ఞం తిరుమంజనం )
క్రీ.శ.1535 నాటికి ఏడాదిలో పది దాకా బ్రహ్మోత్సవాలు జరిగేవి. ప్రతి బ్రహ్మోత్సవానికి ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. తెలుగు నూతన సంవత్సరాది పర్వదినమైన ఉగాది, ఆణివార ఆస్థానం , శ్రీవారి బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
తిరుమల గర్భాలయంలో స్వయంవ్యక్త సాలిగ్రామ శిలామూర్తిగా కొలువైన పవిత్ర గర్భాలయ స్థానమే ఆనందనిలయం. ఆనందనిలయం నుంచి ఆలయమహాద్వారం వరకు శుద్ధిచేయటమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం. దుమ్మూధూళి పడకుండా స్వామి శిరస్సునుంచి పాదాల వరకు ధవళవర్ణ వస్త్రాన్ని కప్పుతారు. దీన్నే మలైగుడారం అంటారు. స్వామి అంశగా భావించే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని మలైగుడారం లోపలే ఉంచుతారు.
ఇక్కడే కొలువైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగద. పరివార దేవతా మూర్తులను ఘంటా మండపం గరుడాళ్వార్ సన్నిధికి తరలిస్తారు. చుట్టూ. తెరలు కట్టి ఈ మూర్తులకు ఏకాంతంగా తిరుమంజనం పూర్తిచేసి కొత్త పట్టువస్త్రాలతో అలంకరిస్తారు. గర్భాలయంలో అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పైకప్పుకు అంటుకున్న బూజు, కర్పూరమసిని తొలగించి, శుద్ధిచేస్తారు. కులశేఖరపడి మొదలు దుమ్ముధూళి, శుద్ధజలంతో మహాద్వారం వరకు ఆలయ అధికారులు, ఉద్యోగులు శుద్ధి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
(ఆలయ ప్రాకారాలకు లేపనం)
నామంకోపు సుద్దపొడి, శ్రీచూర్ణం, ముద్దకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి ఔషధ పదార్థాలతో లేహ్యంగా తయారుచేస్తారు. తిరుమంజనానికి ముందురోజే భారీ గంగాళాల్లో సిద్ధం చేస్తారు. ఈ లేహ్యాన్ని శుద్ధి చేసిన ప్రాకారాలకు లేపనం చేస్తారు. దీనివల్ల ప్రాకారాలు సుగంధ పరిమళాలు వెదజల్లటంతోపాటు ప్రాకారం పటిష్టతకు దోహద పడతాయని పండితులు చెప్పే మాట.