ఎమర్జెన్సీ సమయంలో నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ విధించడం తప్పు అని చెప్పిన వాళ్లను నాటి పాలకులు జైల్లో పెట్టారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. నియంతృత్వానికి ఎమెర్జెన్సీ ఒక నిదర్శనమని అన్నారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన ‘సంవిధాన్ హత్యా దివాస్’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావు లేదన్నారు. మంచి రోజులనే కాదు.. చీకటి రోజులను కూడా గుర్తు పెట్టుకోవాలన్నారు. అప్పుడే ఏది మంచి, ఏది చెడు అనేది అర్థం అవుతుందన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు బాద్యతతో వ్యవహరించాలన్నారు. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. 1975 జూన్ 25 ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య దేశాన్ని అపహాస్యం చేస్తూ ఎమర్జెన్సీ విధించిన రోజు అని చంద్రబాబు అన్నారు.
భారత దేశంలో ఎమర్జెన్సీ అనేది అతి పెద్ద చీకటి రోజు. భారత రాజ్యాంగాన్ని, భారత దేశ ప్రజల హక్కులను కాలరాసిన రోజు అని చంద్రబాబు అన్నారు. నాడు ఎన్నో ఘోర సంఘటనలు జరిగాయన్నారు. మంచి చెడులకు వ్యత్యాసాన్ని తెలిపాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం నేడు సంవిధాన్ హత్యా దివాస్గా దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని. ఈ చీకటి రోజును ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో దీనిని నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. 21 నెలల పాటు దేశ ప్రజలు చీకటిలో మగ్గారని అన్నారు. సామాన్య ప్రజలను కూడా హింసించారని అన్నారు. నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని నాటి పాలకులపై విమర్శలు గుప్పించారు. న్యాయవ్యవస్థలను కబళించారని, ప్రజల ప్రాథమిక హక్కులను సైతం కాలరాశారని మండిపడ్డారు. ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పత్రికా స్వేచ్ఛను హరించారని, పలువురు జర్నలిస్టులను అరెస్టులు చేశారని, డాక్టర్ జయప్రకాష్ నారాయణన్, మోరార్జిదేశాయ్, ఏబీ వాజ్పేయి, ఎల్కే అధ్వానీ వంటి ఎంతో మంది నాయకులను బంధించి జైల్లో పెట్టారని మండిపడ్డారు.
కుటుంబ నియంత్రణను కూడా బలవంతంగా అమలు చేశారని, తాను కూడా జనాభా పెరిగితే కష్టాలు, నష్టాలు తప్పవనే ఉద్దేశంతో దీనిని గతంలో అమలు చేశానని, జనాభా నియంత్రణ కంట్రోల్ చేసినప్పటికీ ఇప్పుడు తన మనస్సును మార్చుకున్నానని, పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నానని ప్రజాస్వామ్యం అంటే అది అని చంద్రబాబు అన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేయడం మంచిది కాదని, దీనిని ప్రజలకు వదిలేయాలని అన్నారు.
స్వేచ్ఛ, సమానత్వం అనే రాజ్యాంగా మూల సూత్రాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే కాదని, ప్రజలపైన కూడా ఉందని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ నాడు గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లి తిరిగి వచ్చేలోపల ఆంధ్రప్రదేశ్లో అల్లకల్లోం సృష్టించారని ఇందిరా గాంధీపై మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో అనేదానికి ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే.. పాలకులు ఎలా ఉండకూడదో అనేదానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక కేస్ స్టడీ అని చంద్రబాబు అన్నారు. 2019–24 మధ్య కాలంలో అన్యాయం, అక్రమాలు, అవినీతిపై గొంతెత్తితే గొంతు నులిమేశారని మండిపడ్డారు. మాస్క్ అడిగితే ఒక డాక్టర్ను వేధించి నడిరోడ్డుపైనే చంపేశారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా గత పాలనలో అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు.