ఈసారి ఫిబ్రవరి లోనే ఏపీ ఇంటర్ పరీక్షలు
సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్కు అనుగుణంగా పలు మార్పులు చేసిన ఇంటర్ బోర్డ్;
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డ్ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏటా మార్చిలో నిర్వహించే పబ్లిక్ పరీక్షలను ఈసారి ఫిబ్రవరిలోనే నిర్వహించాలని నిర్ణయించింది.అంతేకాకుండా ఈ కొత్త విధానం ప్రకారం విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు రోజుకు ఒకే సబ్జెక్టుకు పరీక్ష జరుగుతుందని ప్రకటించింది.మొదట సైన్స్ గ్రూపు సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తారు. సైన్స్ పరీక్షలు పూర్తయ్యాక భాషా సబ్జెక్టులకు, ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూపు పరీక్షలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ ఏడాది కొత్తగా 'ఎంబైపీసీ' గ్రూపును ప్రవేశపెట్టడంతో పాటు విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల ఒకే విద్యార్థికి వేర్వేరు గ్రూపుల సబ్జెక్టులు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకే రోజు రెండు పరీక్షలు రాయడం సాధ్యం కాదు కాబట్టే రోజుకు ఒకే పరీక్ష విధానాన్ని తీసుకొచ్చారు.సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్కు అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.