అరెస్టైన వైసీపీ నాయకులపై ప్రజల్లో సానుభూతి లేదు

మహానాడు మూడో రోజు బహిరంగ సభకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.;

Update: 2025-05-29 07:50 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు అరెస్టు అయిన వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై మంత్రి నిమ్మల రామానాయుడు సంలచన వ్యాఖ్యలు చేశారు. కడపలో జరుగుతున్న మహానాడు మూడో రోజు బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు అరెస్టు అయిన వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మీద ప్రజల్లో ఒక్క శాతం కూడా సానుభూతి లేదని, దీనికి గత ఐదేళ్లు జగన్‌ ప్రభుత్వం చేసిన విధ్వంసమే ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇసుక నుంచి మొదలు పెడితే దేనిని వదల్లేదని, ఇసుక, మైన్స్, భూములు, మద్యం పేరుతో విపరీతంగా దోపిడీకి పాల్పడిందని ఆరోపణలు గుప్పించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఎలాంటి రాజకీయపరమైన కక్షలు ఉండవని, అయితే తప్పులు చేసిన వారిని మాత్రం వదిలేదిలేదని, అలాంటి వారికి శిక్షలు పడటం ఖాయమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

మహానాడు మూడో రోజు గురువారం బహిరంగ సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు. ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా టీడీపీ శ్రేణులు తరలి వస్తున్నారని పేర్కొన్నారు. అదనంగా వాహనాలు కావాలని ఆయా అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి నాయకులు కోరుతున్నారని, ఆ మేరకు వాహనాల ఏర్పాటు కూడా చేసినట్లు తెలిపారు. సుమారు ఐదు లక్షల మంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి రానున్నట్లు తెలిపారు. గత రెండు రోజుల్లో కూడా మహానాడు కార్యక్రమాలు విజయవంతంగానే జరిగాయన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా కార్యక్రమాలు జరిగాయన్నారు. కార్యక్రమాలు పూర్తి అయ్యేంత వరకు కూడా టీడీపీ శ్రేణులు మధ్యలో లేయడం కానీ, వెళ్లిపోడం కానీ చేయలేదని, అంతా శ్రద్ధగా విన్నారని వెల్లడించారు.
మూడో రోజు భారీ బహిరంగ సభకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. భారీగా తరలి వచ్చే టీడీపీ శ్రేణుల వాహనాలన్నింటికీ పార్కింగ్‌ ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఏ నియోజక వర్గం నుంచి, ఏ జిల్లా నుంచి ఎటువైపు వస్తారో చూసుకొని ఆయా రూట్లల్లో వారి వాహనాల కోసం పార్కింగ్‌ ఏర్పాట్లు చేశామన్నారు. రోడ్లపై వాహనాలు నిలపకుండా ఉండేందుకు, నిర్థేశించిన పార్కింగ్‌ ప్రాంతాల్లోనే వాహనాలను నిలిపేవిధంగా, వాహనాల రాకపోకల సమయంలో ట్రాఫిక్‌ జామ్‌ సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ప్రత్యేకంగా వలంటీర్లను కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. భోజనాల ఏర్పాట్లు కూడా ఘనంగా చేశామన్నారు. వేదిక ప్రాంతం వద్దే కాకుండా కడపకు వచ్చే ఐదు రూట్లలో ఐదు చోట్ల కూడా భోజనాలు ఏర్పాటు చేశామన్నారు, గతంలో నిర్వహించిన మహానాడుల కంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా కడప మహానాడు జరగబోతుందని వెల్లడించారు.
నారా లోకేష్‌కు టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిపై మంత్రి నిమ్మల మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం కలిగిన నాయకుడని, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయనకు తెలుసని, లోకేష్‌కు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విషయంపై కూడా ఆయన సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. అయితే యువనేత లోకేష్‌ని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చేయాలని టీడీపీ శ్రేణులు బలంగా కోరుకుంటున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
Tags:    

Similar News