వైద్య రంగంలో నర్సుల సేవలు ప్రసంశనీయం

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్‌ నర్సులతో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సత్కారం.;

Update: 2025-05-12 05:47 GMT

వైద్య రంగంలో నర్సుల సేవలు ప్రసంశనీయమని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ స్ఫూర్తితో... రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని కొనియాడారు. నిస్వార్ధంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని, సాంత్వన కలిగిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని జనసేన క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న స్టాఫ్‌ నర్సులతో సమావేశం అయ్యారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రశంసనీయ సేవలు అందించిన ఎనిమిది మంది స్టాఫ్‌ నర్సులను పవన్‌ కల్యాణ్‌ సత్కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరచిపోరు. మీరు పడే శ్రమ, కష్టం నాకు తెలుసు. కోవిడ్‌ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మీరు విధులు నిర్వర్తించిన విధానం మరువలేం. ఇటీవల సింగపూర్‌ లో నా కుమారుడు మార్క్‌ శంకర్‌ ప్రమాదానికి గురైనప్పుడు ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరోసారి మీ కష్టం గుర్తుకువచ్చింది. మిమ్మల్ని కలసి మీరు అందించే సేవలు మరచిపోలేనివి అని చెప్పి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మిమ్మల్ని కలిసే అవకాశం రావడం ఆనందాన్నిచ్చింది. నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.
Tags:    

Similar News