ఉత్తర కోస్తాలో మొదలైన ‘మొంథా’ ప్రతాపం!
మొంథా తుఫాన్ ప్రభావం ఉత్తర కోస్తాంధ్రలో మొదలైంది. సోమవారం వేకువజాము నుంచే ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తూనే ఉంది.
నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి అనుకుని కొనసాగుతున్న మొంథా తుఫాన్ ఉత్తర కోస్తాపై పంజా విసరడానికి సిద్ధంగా ఉన్నట్టు ముందస్తు సంకేతాలిస్తోంది. సోమవారం తెల్లవారుజాము నుంచే మొంథా ఉనికిని చాటుకుంటోంది. గంటకు 50–60 కి.మీల వేగంతో హోరెత్తుతూ ఈదురు గాలులు వీస్తున్నాయి. కాసేపు భారీ, మరికాసేపు తేలికపాటి వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఉత్తర కోస్తాంధ్రతో పాటు విశాఖ నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. మొంథా తుఫాన్ మంగళవారం రాత్రికి కాకినాడకు సమీపంలో తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని 19 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించింది. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. జనం బీచ్లు, నదీ తీరాలకు వెళ్లకుండా నిషేధం విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బయటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది.
విశాఖ అక్కయ్యపాలెంలో సోమవారం మధ్యాహ్నం కురుస్తున్న వర్షం