అంధుల మహిళా క్రికెటర్లకు పట్టు చీరలతో సత్కారం..5 లక్షల నజరానా
ప్రపంచ విజేత భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసింది.
ప్రపంచ కప్ సాధించిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో క్రికెటర్లు, శిక్షకులు సహాయక సిబ్బంది పాల్గొన్నారు.
నగదు నజరానాతో సన్మానం
నజరానా: ప్రపంచ కప్ సాధించిన ఒక్కో క్రికెటర్కు రూ. 5 లక్షల చొప్పున చెక్కును పవన్ కళ్యాణ్ ప్రదానం చేశారు.
శిక్షకులకు ప్రోత్సాహం: జట్టు శిక్షకులకు (కోచ్లకు) రూ. 2 లక్షలు చొప్పున చెక్కులు అందించారు.
సత్కారం: ప్రతి క్రీడాకారిణికి పట్టు చీర, శాలువాతోపాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సన్మానించారు.
దేశానికి గర్వకారణం
మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని పవన్ కళ్యాణ్ కొనియాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, క్రీడాకారిణులు తెలిపిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి
అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, వారికి అన్ని విధాలా అండగా నిలవాలని కోరుదూ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఆంధ్ర ప్రదేశ్ క్రీడాకారీణులు దీపిక (జట్టు కెప్టన్), పాంగి కరుణా కుమారి ఉండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
తక్షణ సమస్యల పరిష్కారంపై ఆదేశాలు
ఈ సందర్భంగా జట్టు కెప్టన్ దీపిక (శ్రీ సత్యసాయి జిల్లా, తంబలహట్టి తండాకు చెందినవారు) తమ గ్రామానికి రహదారి సౌకర్యం కావాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి, రహదారి సౌకర్యం కల్పించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే, అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెందిన క్రికెటర్ కరుణకుమారి చేసిన విజ్ఞప్తులపైనా తక్షణమే చర్యలు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు.