కల్వకుంట్ల ఫ్యామిలీ విచారణలు ఎదుర్కొంటున్న కేసులివేనా ?
కుల్వకుంట్ల ఫ్యామిలీలోని ముగ్గురూ విచారణలను ఎదుర్కొంటున్నది తెలంగాణ కోసం పోరాటాలు చేసికాదు.;
కల్వకుంట్ల కవిత...ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని జైలుకు వెళ్ళి బెయిల్ పైన బయటతిరుగుతున్నారు.
కేటీఆర్...ఫార్ముల ఈ కార్ రేసులో అవినీతి, అధికారదుర్వినియోగానికి పాల్పడి విచారణ ఎదుర్కొంటున్నారు.
కేసీఆర్...కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి, అవకతవకల ఆరోపలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ఎదుర్కొన్నారు.
పై ముగ్గురి వ్యవహారాన్ని గమనించిన తర్వాత ఎవరికైనా అర్ధమయ్యేది ఏమిటంటే కుల్వకుంట్ల ఫ్యామిలీలోని ముగ్గురూ విచారణలను ఎదుర్కొంటున్నది తెలంగాణ కోసం పోరాటాలు చేసికాదు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 10 ఏళ్ళు అపరిమితమైన అధికారాలను చెలాయించారు. ఆసమయంలో అవినీతి, అవకతవకలకు, అధికారదుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు ముసురుకున్నాయి. వాళ్ళమీదున్నవి ఆరోపణలు మాత్రమే కాదు పచ్చినిజాలని దర్యాప్తుసంస్ధలు ఇప్పటికే నిగ్గుతేల్చాయి. అందుకనే వీళ్ళపై కేసులు, విచారణలు జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ, ఈడీలు ఒకడుగు ముందుకేసి కవితను అరెస్టుచేశాయి. కోర్టు ఆమెను తీహార్ జైలుకు రిమాండుకు పంపింది. ఇంతోటిదానికి ఒకసారి కాదు తామంతా 100 సార్లు జైళ్ళకు పోవటానికి సిద్ధంగా ఉన్నామంటు పెద్ద బిల్డప్ ఇస్తున్నారు.
ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణను ఎదుర్కొన్న కేటీఆర్ మీడియాతో మాట్లాడినపుడు పెద్ద బిల్డప్పే ఇచ్చారు. ఒకసారి కాదు వందసార్లయినా తెలంగాణ కోసం జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నట్లు పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తి చెప్పటమే విచిత్రంగా ఉంది. కేటీఆర్ విచారణను ఎదుర్కొంటున్నది అధికారదుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడిన కేసులో. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది ఇప్పటికే నిరూపితమైంది. బ్రిటన్ కంపెనీకి రు. 45 కోట్ల చెల్లింపులు ఆర్ధికశాఖ అనుమతి తీసుకోలేదు, క్యాబినెట్ తీర్మానంలేదు, రిజర్వ్ బ్యాంకుకు చెప్పలేదు, కేంద్ర ఎన్నికల కమీషన్ తో సంబంధంలేకుండానే కోట్ల రూపాయల నిధులు చెల్లించేశారు. ఇవే విషయాలను విచారణలో ఏసీబీ అధికారులు అడిగినపుడు అవన్నీ అధికారులు చూసుకున్నారనే విచిత్రమైన సమాధానం చెప్పారు. నిధులు చెల్లించమని తానే అధికారులకు ఫోన్లో ఆదేశాలు ఇచ్చినట్లు గొప్పగా చెప్పారు. పైగా తనను అరెస్టు చేసుకుంటే చేసుకోండని బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు కూడా కేటీఆర్ మీడియాతో చెప్పారు.
అంటే కేటీఆర్ వైఖరి చూసినపుడు అరెస్టుకు మానసికంగా సిద్ధపడినట్లు అర్ధమవుతోంది. జైలుకు పంపితే యోగాచేస్తా, ఇంకా స్లిమ్ముగా తయారవుతా అని చెప్పేందంతా ఓ ఓవర్ యాక్షన్లో భాగమనే అనుకోవాలి. లోపలున్న అరెస్టు భయం బయటపడకుండా పైకి బింకంగా కనబడేందుకు చేస్తున్న నటనగా అర్ధమైపోతోంది. నిబంధనలన్నింటినీ కాలరాసేసి బ్రిటన్ కంపెనీకి రు. 45 కోట్లను పౌండ్లరూపంలో చెల్లించింది వాస్తవం. అప్పటివరకు కార్ రేసులో భాగస్వామిగా ఉన్న నెక్స్ట్ జనరేషన్ సడెన్ గా తప్పుకోవటం వ్యూహంలో భాగమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రేసు వ్యవహరంలో ఒక్కరూపాయి కూడా లబ్దిపొందలేదని పదేపదే కేటీఆర్ చెబుతున్నారు. మరి భాగస్వామ్యం నుండి తప్పుకున్న నెక్స్ట్ జనరేషన్ కంపెనీ బీఆర్ఎస్ కు రు. 45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వటాన్ని ఏమంటారో కేటీఆర్ చెబితే బాగుంటుంది.
ఇక కవితక్క విషయం చూస్తే మరీ విడ్డూరంగా ఉంటుంది. విచారణకు రమ్మని దర్యాప్తు సంస్ధలు తనకు నోటీసులు ఇచ్చినపుడు మొత్తం తెలంగాణకు నోటీసులు ఇవ్వటమే అని నానా గోలచేసింది. సారా కుంభకోణంలో ఇరుక్కున్న కవితను విచారించేందుకు సీబీఐ, ఈడీ నోటీసులిస్తే తెలంగాణకు ఏమి సంబంధం ? తెలంగాణ సమాజం కవితను సారా కుంభకోణంలో ఇరుక్కోమని చెప్పిందా ? తమిష్టం వచ్చినట్లు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, అవినీతిలో ఇరుక్కున్నారు. దాంతో కేసులు పడి, విచారణలు ఎదుర్కోవాల్సొచ్చినపుడు తెలంగాణ సెంటిమెంటును అడ్డుపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నోటీసుల విషయంలో కవిత ఎంత రెచ్చగొట్టినా తెలంగాణ జనాలు ఏమాత్రం పట్టించుకోలేదని అందరికీ తెలిసిందే. చివరకు కేసీఆర్ కూడా నోరిప్పి ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
కేసీఆర్ విషయం చూస్తే లక్షలాది కోట్లరూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసిన కేసులో విచారణను ఎదుర్కొన్నారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టును రు. 87 వేలకోట్లు ఖర్చుతో కడితే మూడేళ్ళకే ఎందుకు పనికిరాకుండా పోయింది. కాళేశ్వరానికి అనుబంధంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. అలాగే సుందిళ్ళ, అన్నారం బ్యారేజీల నుండి నీరు కారుతోంది. పై మూడు బ్యారేజీలు నీటి నిల్వకు పనికిరానపుడు కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగానికి ఎంతమాత్రం పనికిరాదు. ప్రాజెక్టు, బ్యారేజీల నిర్మాణంలో అవినీతి, అవకతవకలకే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరైంది. ఇదే కేసులో అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కూడా విచారణను ఎదుర్కొన్నారు. కవిత, కేటీఆర్ వైఖరి ఎలాగుందంటే తాము అధికారదుర్వినియోగానికి పాల్పడినా, అవకతవకలు, అవినీతికి చేసినా తమను ఎవరు ప్రశ్నించకూడదన్నట్లుగానే మాట్లాడుతున్నారు.
కాళేశ్వరం అవినీతే కాదు, విద్యుత్ రంగంలో జరిగిన అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలను కూడా కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. అలాగే టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను కూడా ఎదుర్కొంటున్నారు. తన హయాంలో 4200 ఫోన్లను కేసీఆర్ నిబంధనలకు వ్యతిరేకంగా ట్యాపింగ్ చేయించినట్లు తీవ్రమైన ఆరోపణలున్నాయి. ట్యాపింగ్ కేసులో ఏ1గా విచారణను ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ మాజీ బాస్ టీ ప్రభాకరరావు గనుక అప్పట్లో ఏమి జరిగిందన్న విషయం బయటపెడితే కేసీఆర్, కేటీఆర్ ఇరుక్కోవటం ఖాయమని మంత్రులు, కాంగ్రెస్ నేతలు పదేపదే చెబుతున్నారు. కేసుల విచారణను ఎదుర్కొన్న ప్రతిసారి కేటీఆర్ మాట్లాడుతు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనను నిలదీస్తునే ఉంటామంటు హెచ్చరించటమే విచిత్రంగా ఉంది. పదేళ్ళ బీర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అవతకవకలు, అధికార దుర్వినియోగం కేసుల్లో విచారిస్తుంటే కేటీఆర్, హరీషేమో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజా వ్యతిరేక పాలన చేస్తోందంటు నానా గోలచేస్తున్నారు.