స్పూర్తి దాయకమైన చల్లపల్లి రాజా జీవితం

చల్లపల్లి జమిందారీ వంశం పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ సేవలు మరపు రానివి.;

Update: 2025-06-07 13:14 GMT
చల్లపల్లి రాజా

శ్రీమంతు రాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ జీవితం స్ఫూర్తిదాయక మైనది. జమీందారీ వంశానికి చెందిన వ్యక్తిగా ఆయన సంపద, అధికారాన్ని స్వీయ గౌరవంగా భావించకుండా, వాటిని ప్రజాసేవకు, సామాజిక ఉన్నతికి ఉపయోగించారు. విద్య ద్వారా సమాజంలోని వెనుకబడిన వర్గాల జీవన ఉన్నతికి ఆయన చేసిన కృషి, రాజకీయాల ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి ఆయన చేసిన ప్రయత్నాలు, దేవాలయాల సంరక్షణ ద్వారా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ఆయన చూపిన నిబద్ధత, ఇవన్నీ ఆయన బహుముఖ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి.

ఆయన మరణం చల్లపల్లి ప్రాంతానికి తీరని లోటు. అయినప్పటికీ, ఆయన వదలివెళ్లిన సేవా వారసత్వం రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

చల్లపల్లి జమిందారీ వంశం

చల్లపల్లి జమిందారీ వంశం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఒక చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన సంస్థానం. ఈ వంశం జమిందారీ వ్యవస్థలోనూ, ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ ప్రజలకు సేవ చేసిన ఘన చరిత్ర కలిగినది. శ్రీమంతురాజా యార్లగడ్డ శివరామప్రసాద్ బహద్దూర్ నాయకత్వంలో ఈ వంశం ప్రజాసేవ, దేవాలయ నిర్వహణ, విద్యాభివృద్ధిలో అనేక కృషిచేసింది. ఈ వారసత్వాన్ని అంకినీడు ప్రసాద్ తన సోదరులతో కలిసి కొనసాగించారు.

విద్యారంగంలో సేవలు

శ్రీ అంకినీడు ప్రసాద్ చల్లపల్లిలోని ఎస్సార్ వైఎస్పీ జూనియర్ కళాశాల కరస్పాండెంట్‌గా పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. విద్యను సామాజిక ఉద్ధరణకు మూలస్తంభంగా భావించిన ఆయన, అనేక మంది విద్యార్థులకు విద్యావకాశాలు అందించడం ద్వారా వారి జీవితాలను సుసంపన్నం చేశారు. ఆయన విద్యాసంస్థల నిర్వహణలో చూపిన నిబద్ధత, పేద విద్యార్థుల ఉన్నతికి ఆయన చేసిన కృషి చల్లపల్లి ప్రాంతంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

రాజకీయ జీవితం

1967లో మచిలీపట్నం పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన అంకినీడు ప్రసాద్, ఆ ప్రాంత అభివృద్ధికి తన రాజకీయ ప్రస్థానాన్ని అంకితం చేశారు. జమీందారీ వంశానికి చెందిన వ్యక్తిగా ఉంటూనే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు సేవ చేయడం ద్వారా ఆయన నిజమైన ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు. కృష్ణా జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్ర అమూల్యమైనది. ఆయన 1939లో జన్మించారు. 2025 జూన్ 6న కోయంబత్తూరు నివాసంలో మృతి చెందారు.

సామాజిక సేవ, దేవాలయాల అభివృద్ధి

చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అనువంశిక ధర్మకర్తగా అంకినీడు ప్రసాద్ మోపిదేవి, శ్రీకాకుళం, పెదకళ్లేపల్లి, యార్లగడ్డ, శివగంగలోని ప్రాచీన దేవాలయాల అభివృద్ధి నిర్వహణలో విశేష కృషి చేశారు. ఈ దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలుగా కూడా పనిచేశాయి. ఆయన తండ్రి శివరామ ప్రసాద్ బహద్దూర్ అడుగుజాడల్లో నడుస్తూ, ఈ దేవాలయాల సంరక్షణకు ఆయన చేసిన సేవలు స్థానిక ప్రజలకు ఆధ్యాత్మిక, సామాజిక ఉత్సాహాన్ని అందించాయి.

పదేళ్ల క్రితం భార్య విశాలాక్షి మృతి 

చల్లపల్లి రాజా భార్య విశాలాక్షి పదేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు యార్లగడ్డ రామేశ్వర ప్రసాద్ కోయంబత్తూర్ లో ఉంటారు. చల్లపల్లి కోట వ్యవహారాలన్నీ ప్రస్తుతం ఆయనే చూసుకుంటున్నారు. ప్రస్తుతం రామేశ్వరప్రసాద్ అంతర్జాతీయ స్కూబా డైవింగ్ కోచ్ గా ఉన్నారు. మరో కుమారుడు హరీశ్వరప్రసాద్ చెన్నై, కోయంబత్తూర్, అమెరికాల్లో ఉంటూ వ్యాపారాలు చేస్తున్నారు. ఒక కుమార్తె దిండిగల్లు టెక్స్ టైల్స్ వ్యాపారం చేస్తున్నారు. మరో కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. 

ఆదివారం అంత్యక్రియలు 

చెన్నైలోని కోయంబత్తూర్ లో చనిపోయిన చల్లపల్లి రాజాను శనివారం చల్లపల్లి కోటకు తీసుకొచ్చారు. స్థానికుల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని చల్లపల్లి కోటలో ఉంచారు. జనసేన నాయకులు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఇతర నాయకులు నివాళులు అర్పించారు. ఆదివారం చల్లపల్లిలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 

Tags:    

Similar News