పరిపాలనపై ‘యోగాంధ్ర’ ప్రభావం

నెల రోజులుగా యోగాంధ్రపైనే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి;

Update: 2025-06-17 09:13 GMT
తల్లికి వందనం జాబితా పరిశీలనలో తల్లిదండ్రులు

యోగాంధ్ర కార్యక్రమం యోగా పట్ల అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీని అమలు విధానం పరిపాలనా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్రామ సచివాలయాలు, తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో పనులు మందగించడం, తల్లికి వందనం నిధులు, విద్యా సర్టిఫికెట్ల జారీలో జాప్యం వంటి సమస్యలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం ఈ సమస్యలను తక్షణం పరిష్కరించి, యోగాంధ్ర కార్యక్రమంతో పాటు రోజువారీ పరిపాలనకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రజల్లో పాలనపై నమ్మకం పెంచాలి.

ప్రభుత్వం 2025 జూన్ 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ‘యోగాంధ్ర’ పేరిట నెల రోజుల పాటు భారీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో 5 లక్షల మంది పాల్గొనేలా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ప్రపంచ రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం దీనిపై దృష్టి సారించింది.

రాష్ట్రవ్యాప్తంగా లక్ష స్థలాల్లో యోగా కార్యక్రమాలు

విద్యా మంత్రి నారా లోకేశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, గ్రామ సచివాలయాలు, తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి రిజిస్ట్రేషన్లు, శిక్షణ కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


కార్యాలయాల్లో పనుల ఆలస్యం

గ్రామ సచివాలయాలు, తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో యోగాంధ్ర కార్యక్రమం కోసం రిజిస్ట్రేషన్లు, యోగా శిక్షణ కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. దీంతో సాధారణ పరిపాలనా విధులు, ప్రజల సమస్యల పరిష్కారం వెనుకబడుతున్నాయి. ఉదాహరణకు ఆస్తి పత్రాలు, రేషన్ కార్డులు, పెన్షన్ సంబంధిత సమస్యలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల కేటాయింపు వంటి విషయాల్లో ఆలస్యం జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.

తల్లికి వందనం పథకం నిధుల విడుదలలో జాప్యం

కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తల్లికి వందనం’ పథకం కింద నిధులు చాలా మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు చేరలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ పథకం కింద జూన్ 14, 2025న నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అధికారులు యోగాంధ్ర కార్యక్రమంపై దృష్టి పెట్టడంతో ఈ పథకం అమలులో లోపాలు ఏర్పడ్డాయి. ఫలితంగా చాలా మంది తల్లులు ఆర్థిక సాయం అందక ఇబ్బందులు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆదివారం నాటికి తప్పకుండా డబ్బులు పూర్తి స్థాయిలో మీ అకౌంట్స్ లో ఉంటాయని ఇప్పటికే లోకేష్ ప్రకటించారు.

విద్యా సంవత్సరం ప్రారంభంలో సర్టిఫికెట్ల సమస్య

2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంలో, విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్లు (ఆదాయ ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, బోనఫైడ్ సర్టిఫికెట్లు) జారీలో గణనీయమైన జాప్యం జరుగుతోంది. గ్రామ సచివాలయాలు, తహశీల్దార్ కార్యాలయాల్లో అధికారులు యోగాంధ్ర కార్యక్రమంలో బిజీగా ఉండటంతో, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. దీని వల్ల విద్యార్థుల ప్రవేశాలు, స్కాలర్‌షిప్ దరఖాస్తులు ఆలస్యమవుతున్నాయి.

విశాఖపట్నంలో జరిగే యోగా దినోత్సవం రాష్ట్ర ప్రతిష్ఠను పెంచుతుందని, గిన్నిస్ రికార్డు సాధనతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2.17 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 25 లక్షల మందికి సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

విజయవాడ పోలీస్ కాలనీలో ఉన్న వార్డు సచివాలయాన్ని ‘ది ఫెడరల్ ప్రతినిధి’ మంగళవారం ఉదయం సందర్శించి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి సచివాలయంలో డిస్ ప్లే చేసిన జాబితాలో తమ పిల్లలు పేర్లు కొందరు వెతుకుతున్నారు. జాబితాలో తప్పులను కొందరు అడుగుతున్నారు. తాము బ్యాంకుకు డబ్బు పంపించామని, బ్యాంకు వారిని ఖాతాలో ఎందుకు డబ్బులు పడలేదని మేనేజర్ ను అడగాల్సిందిగా సచివాలయం వారు చెబుతున్నారు.

తాము పడుతున్న బాధను వివరించేందుకు అధికారులు విముఖత వ్యక్తం చేశారు. ఎవరిని అడిగినా యాంధ్ర పనిలో ఉన్నామని, తరువాత వస్తే వివరాలు చెబుతామని సచివాలయం వారు కూడా సరిగా పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ పేర్లు రాయొద్దని వారు చెప్పటం విశేషం.

Tags:    

Similar News