వైభ‌వంగా సాగిన శ్రీపద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

26న ఆలయంలో పుష్పయాగం

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-25 11:36 GMT
తిరుచానూరు పద్మపుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తున్న పండితులు

శ్రీవారి కానుక కమలముల హారం, వజ్రాల అడ్డిగ. క‌నుల‌విందుగా సిరులతల్లికి స్న‌ప‌న‌ తిరుమంజ‌నం. పద్మపుష్కరిణిలో పవిత్రస్నానంతో భక్తుల తన్మయత్వం.

శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా భక్తులు పవిత్రస్నానం ఆచరించారు.


టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు మీడియాతో మాట్లాడుతూ, లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమీతీర్థ మహోత్సవం వైభవోపేతంగా జరిగిందన్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడిలోని అన్ని విభాగాలు పటిష్టమైన ఏర్పాట్లు చేసి, విజయవంతంగా జరిగాయన్నారు. అన్ని విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు. భక్తులందరికీ అమ్మవారి కరుణాకటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

ఉదయం ఆలయ మాడవీధుల్లో
శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో మంగళవారం దయం ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీతీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. అర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
అమ్మవారికి శ్రీవారి కానుక
శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు. రూ.1.31 కోట్లు విలువైన 1.14 కిలోల బరువు గల బంగారు పుష్పాల హారం తోపాటు వజ్రాల అడ్డిగ నగ, సారెతో పాటు తిరుప‌తి పుర‌వీధుల‌లో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.
సిరులతల్లికి స్న‌ప‌న‌తిరుమంజ‌నం

అమ్మవారి ఆలయానికి వెనుక వైపు ఉన్న పుష్కరిణికి సమీపంలోని పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన కుంకుమపువ్వు, పైనాపిల్, డ్రై ఫ్రూట్స్, రెడ్ ఎల్లో రోజాపెరల్స్, వట్టివేరు, తులసిమాల‌లు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి.
పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఒక టన్ను పుష్పాలతో ఏర్పాటు చేసిన మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో తామర పూలు, రోజాలు, లిల్లీలు తదితర సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ తో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.
మధ్యాహ్నం 12.10 నుంచి 12.20 గంటల మధ్య పంచమి తీర్థం(చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఊరేగించనున్నారు. అనంతరం రాత్రి 10 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరుగనుంది. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, చంద్రగిరి ఎంఎల్‌ఏ పులివర్తి నాని, టీటీడీ బోర్డు స‌భ్యులు ఎన్. సదాశివరావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నరేష్ కుమార్, ఎం.శాంతారామ్, జానకి దేవి, అనుగోలు రంగశ్రీ, ఎక్స్ అఫిషియో మెంబర్ సి.దివాకర్ రెడ్డి హాజరయ్యారు.
టీటీడీ జెఈవో వి.వీరబ్రహ్మం, సివిఎస్‌వో కే.వి. మురళీకృష్ణ, ఎస్పీ ఎల్ . సుబ్బరాయుడు, సిఈ సత్యనారాయణ, ఎఫ్ఏ అండ్ సీఏఓ ఓ బాలాజీ, డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన నేపథ్యంలో 26వ తేదీ ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5 నుంచి ఎనిమిది గంటల వరకు వైభవంగా నిర్వహించనున్నారు.
Tags:    

Similar News