'సైకో పాలనకు అంతం పలికిన రోజు'
జగన్ ప్రభుత్వంపైన, జగన్ పాలనపైన ఓ రేంజ్లో విమర్శించిన సీఎం చంద్రబాబు.;
By : The Federal
Update: 2025-06-04 06:19 GMT
జూన్ 4తో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి అయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో సైకో పాలనకు అంతం పలికిన రోజు అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అని, ప్రజా విప్లవానికి, నియంత పాలకులు కొట్టుకొని పోయిన రోజు అని పేర్కొన్నారు. ఆ మేరకు బుధవారం సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.
చంద్రబాబు ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జూన్ 4 చరిత్ర సృష్టించిన రోజు. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు. అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు. సైకో పాలనకు అంతం పలికి.. ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు. ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు. ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు. పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు.
ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతి రోజూ పనిచేస్తున్నాం. ప్రజల ఆశలు, ఆకాంక్షల నెరవేర్చేందుకు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలనను గాడిన పెట్టి...సంక్షేమాన్ని అందిస్తూ... అభివృద్ధి పట్టాలెక్కించాం. రాష్ట్ర దశ దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పుకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మాట ఇస్తున్నాము.
విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు, ధన్యవాదాలు. జై ఆంధ్రప్రదేశ్..జై జై ఆంధ్రప్రదేశ్! అంటూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లకు తన ట్వీట్ను ట్యాగ్ చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులు కుదుర్చుకున్నట్లు ఆ పార్టీ గుర్తులతో రూపొందించిన చిత్రాన్ని, ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్లతో కలిసి చంద్రబాబు సాగించిన ఫొటోను షేర్ చేశారు.