తురకపాలెం మరణాలకు కారణాలు ఇప్పుడే చెప్పలేం

బ్లడ్‌ రిపోర్ట్స్‌ కోసం ఎదురు చూస్తున్నామని క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం డీఎంఈ డైరెక్టర్‌ డాక్టర్‌ రఘునందన్‌ వెల్లడించారు.;

Update: 2025-09-03 18:49 GMT

గుంటూరు జిల్లా తురకపాలెంలో గడచిన 5 నెలల్లో మరణాలకు దారితీసిన కారణాలను ఇప్పుడే చెప్పలేమని, రక్త నమూనాల రిపోర్టులు అందాకే చెప్పగలమని రాష్ట్ర ఉన్నత స్థాయి వైద్యుల బృందం పేర్కొంది. ఈ గ్రామంలో గడచిన 5 నెలల్లో 30 మంది ప్రాణాలు విడిచారని తెలిపింది. ముఖ్యంగా జులై, ఆగస్టు నెలల్లో 20 మరణాలు సంభవించాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 3 మరణాలు సంభవించగా, ఒకటి రోడ్డు ప్రమాదం కారణంగా జరిగింది. అయితే ఈ మరణాలు మెలైడియోసిస్‌ కారణంగా జరిగాయా లేదా అన్న విషయం శనివారంలోగా అందే రక్త నమూనాల పరీక్షల నివేదిక ఫలితాల ద్వారా తెలుస్తుందని ఉన్నత వైద్యుల బృందానికి నేతృత్వం వహించిన డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) డాక్టర్‌ రఘునందన్‌ వెల్లడించారు. వరుస మరణాలకు కారణాలు పరిశీలించేందుకు డాక్టర్‌ రఘునందన్‌ నేతృత్వంలో వైద్య నిపుణుల బృందం బుధవారం తురకపాలెం పరిశీలకు వెళ్లింది. డిఎంఈ డైరెక్టర్‌ డాక్టర్‌ రఘునందన్, గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుందరాచారి, డిఎంఅండ్‌ హెచ్‌ ఓ డాక్టర్‌ విజయలక్ష్మి, స్థానిక వైద్య నిపుణులు డాక్టర్‌ కళ్యాణ్‌ ఇతర అధికారులు తురకపాలెం గ్రామాన్ని బుధవారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా మరణించినవారి కుటుంబాల సభ్యుల్ని కూడా పరామర్శించారు.

అనంతరం రఘునందన్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం గుంటూరు జిజిహెచ్‌ లో ఇద్దరు ఇన్‌ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు జ్వరంతో ఉన్న 29 మంది నుంచి సేకరించిన రక్తనమూనాలను గుంటూరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలోని మైక్రోబయోలజీ ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారని చెప్పారు. బ్యాక్టీరియా కారణంగా వచ్చే మెలైడియోసిస్‌ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఐవి యాంటీబయోటిక్‌ చికిత్స ద్వారా రోగులు కోలుకుంటున్నారని చెప్పారు.
ఈ ఏడాది జనవరి నుంచి మార్చ్‌ మధ్య ఐదుగురు మరణించారు. ఏప్రిల్‌లో 2, మేలో 3, జూన్‌లో 2, జులైలో 10, ఆగస్టులో 10 చొప్పున మరణాలు నమోదయ్యాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 3 మరణాలు జరిగినట్లు నమోదయ్యాయి. వీరిలో ఏడుగురు వేర్వేరు సమయాల్లో గుంటూరు జీజీహెచ్‌ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. బీపీ, షుగర్, కిడ్నీల పనితీరు మందగించడం వంటి ఇతర వ్యాధులు కలిగిన మరణించిన వారిలో 80 శాతం మంది పురుషులున్నారు. చనిపోయిన వారి వయసు సగటు 55. ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి వారి రోగుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా ఇద్దరు మెలైడియోసిస్‌ బారిన పడినట్లు గుర్తించారని మా దృష్టికొచ్చింది. గత నెలలో వేర్వేరు తేదీల్లో ఈ రెండు కేసులు వచ్చాయి. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ల్యాబ్‌ లో జరిగే పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. తురకపాలెం గ్రామంలో గత నెల 29 నుంచి వైద్య శిబిరం కొనసాగుతోంది. గ్రామ జనాభా 2500 కాగా, వీరిలో ఇప్పటి వరకు 1200 మందికి పరీక్షలు చేశాం. బుధవారంనాడు 42 మంది పరీక్షలు చేయించుకోగా వీరిలో ఎక్కువ మందిలో జ్వర పీడితులున్నారు. వీరు ఇళ్ల వద్దనే చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మందికి దగ్గు, కీళ్ల నొప్పులున్నాయి. స్థానికుల్లో 30 ఏళ్లు దాటిన వారిలో బీపీతో 30 శాతం, షుగర్‌ తో 10 శాతం మంది బాధపడుతున్నారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌ లో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది ‘ అని డీఎంఈ డైరెక్టర్‌ డాక్టర్‌ రఘునందన్‌ వెల్లడించారు.
Tags:    

Similar News