ఏపీ బడ్జెట్‌ను మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు

కూటమి ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు వాస్తవాలకు పొంతన లేకుండా ఉందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన మండిపడ్డారు.;

By :  Admin
Update: 2025-02-28 12:31 GMT

కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ బుక్‌లో కలర్‌ ఎక్కువ.. కంటెంట్‌ తక్కువని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మీద ఆయన మాట్లాడుతూ మండిపడ్డారు. అప్పుల మీద కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ధ్వజమెత్తారు. అప్పుల మీద కూటమి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు కరెక్టా? కాగ్‌ చెబుతున్న లెక్కలు కరెక్టా? అని నిలదీశారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ. 14లక్షల కోట్లు అప్పు చేసిందని కూటమి నాయకులు అబద్దాలు చెబుతున్నారని, రూ. 4, 38,278 కోట్లు అప్పులున్నాయని అధికారికంగా బడ్జెట్‌ బుక్‌లో చెబుతున్నారని, అప్పుల మీద ఎందుకు అబద్దాలు చెబుతున్నారని ప్రశ్నించారు. కార్పొరేషన్‌ అప్పులు రూ. 2,48, 677వేల కోట్లని కూటమి ప్రభుత్వం చెబుతోందని, అయితే కాగ్‌ అందుకు భిన్నంగా లెక్కలు చెప్పిందని, రూ. 1,54,797 కోట్లని కాగ్‌ చెబుతోందని వెల్లడించారు. వీటిల్లో ఎవరు కరెక్టు అని ప్రశ్నించారు. సివిల్‌ సప్లైస్‌ విభాగంలో రూ. 36వేల కోట్లు అప్పులు చేశామని కూటమి చెబుతోందన్నారు.

అలాగే డిస్కంలలో కూడా అప్పులు చేసినట్లు చెబుతున్నారని మండిపడ్డారు. డబుల్‌ టైమ్‌ లెక్కలేసి కూటమి ప్రభుత్వం వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై కావాలనే బురదజల్లుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం చెల్లింపులు చేయక పోవడం వల్ల విద్యుత్‌ సంస్థలు అప్పులు చేయాల్సి వచ్చిందని, దీనిని కూడా రెంటు సార్లు లెక్కలేసి చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ తన 9 నెలల పాలన కాలంలో రికార్డు స్థాయిలో రూ. 1.30లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారని ఆరోపించారు. కుప్పల తెప్పలుగా కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

2018–19లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తలసరి ఆదాయంలో 18వ స్థానంలో ఉంటే, 2022–23 నాటికి ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే 15వ స్థానంలోకి వచ్చిందన్నారు. భారత దేశ సగటుతో రాష్ట్ర వృద్ధి రేటును చూడాలన్నారు. 2014–15 నుంచి 2019 వరకు దేశ స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భాగం 4.47 శాతం ఉందని, తమ హయాంలో 4.8 శాతం సాధించామన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలతో ఎన్నికలకు పోయారని, కానీ ఇంత వరకు సూపర్‌ సిక్స్‌ అమలుకు చర్యలు తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉత్సాహం ఊపు లేదని, అంతా డల్‌గా ఉన్నారని ఎద్దేవా చేశారు.
సూపర్‌ సిక్స్‌లో 20లక్షల యువతకు ఉద్యోగాలన్నారని, కానీ ఇంత వరకు ఎవరికీ రాలేదన్నారు. నెలకు రూ. 3వేలు నిరుద్యోగ భృతి అన్నారని, కానీ ఇంత వరకు ఇవ్వలేదన్నారు. స్కూలుకు పోయే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15వేలన్నారు, కానీ ఇంత వరకు రాలేదన్నారు. ప్రతి రైతుకు రూ. 25వేలు అన్నారు, కానీ ఇంత వరకు ఇవ్వలేదన్నారు. వీటి కోసం ఇది వరకు బడ్జెట్‌లో పెట్టారని కానీ అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఇస్తామన్నారు, కానీ ఇవ్వ లేదు. దీని కోసం మహిళలు ఎంతో ఆశతో ఉన్నారు. కానీ ఇంత వరకు ఇవ్వ లేదు.
ఉచిత ప్రయాణం ఊసే లేదని ధ్వజమెత్తారు. తల్లికి వందనం అమలు చేస్తామంటున్నారు కానీ కేటాయింపులు చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. రూ. 9,700 కోట్లు కేటాయించినట్లు చూపిస్తున్నారని, కానీ అసలు లెక్కల ప్రకారం ఇది చాలదన్నారు. తల్లికి వందనం అమలు చేయాలంటే రూ. 12,450 కోట్లు అవసరం అవుతుందన్నారు. దీనికి పెద్ద లెక్కలు అవసరం లేదని, ఏపీలో 83 లక్షల మంది పిల్లలు చదువుతున్నారని, ఒక్కో విద్యార్థికి రూ. 15వేలు లెక్కన చూస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలిసి పోతుందన్నారు. కానీ బడ్జెట్‌ కేటాయింపుల్లో అంతకంటే తక్కువ పెట్టారని, అందులో లోపలికెళ్లి చూస్తే.. 8, 278 కోట్లు మాత్రమే కేటాయించినట్లు కనిపిస్తోందన్నారు. కూటమి ప్రకారం అయితే 55లక్షల పిల్లలకు మాత్రమే సరిపోతుందని, తక్కిన వారికి లేనట్లే అని వెల్లడించారు. అంటే తల్లికి వందనంలో కోతలు విధించే అవకాశం ఉందన్నారు. వలంటీర్లను నిట్టనిలువన ముంచారని మండిపడ్డారు.
Tags:    

Similar News