తెలంగాణ లోనూ ఉగ్ర లింకులు..ఉగ్రవాదుల కుట్ర భగ్నం
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఢిల్లీ స్పెషల్ పోలీసుల తనిఖీలు,ఒకరి అరెస్ట్;
By : V V S Krishna Kumar
Update: 2025-09-11 15:39 GMT
దేశవ్యాప్తంగా ఉగ్రలింకులపై అధికారులు ఫోకస్ పెట్టారు. పలు రాష్ట్రాలలో విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్ ఉగ్రవాద సంస్థ పన్నిన భారీ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి.ఇప్పటికే పలుప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు రసాయన ఆయుధాల తయారీలో నైపుణ్యం కలిగిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.ఉగ్రవాదులతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోనూ ఉగ్రలింకులు కలకలం రేపాయి.నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అనుమానిత ప్రాంతాల్లో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
తెలంగాణ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో ఈ స్లీపర్ సెల్ గుట్టు రట్టయింది. ఈ ముఠా పాకిస్థాన్ లోని తమ హ్యాండ్లర్ల నుంచి ఆదేశాలు అందుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు.అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఉగ్రవాద ముఠా 'ఖిలాఫత్' నమూనాను అనుసరిస్తోంది.యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడం, బాంబులు తయారుచేయడం, ఆయుధాలు సమకూర్చుకోవడం వంటి పనులను ఈ ముఠా సభ్యులు చూసుకుంటున్నారని తెలిసింది. 'ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకుని, అక్కడి నుంచి జిహాద్ కార్యకలాపాలు సాగించడమే ' ఖిలాపత్ మోడల్ అని అధికారులు వెల్లడించారు.
అరెస్టయిన ఐదుగురిలో ఇద్దరిని ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు.వారిని ముంబైకి చెందిన అఫ్తాబ్, అబు సుఫియాన్గా గుర్తించారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్లో కమ్రాన్ ఖురేషిని, తెలంగాణలోని బోధన్ లో హుజైఫ్ యెమెన్ను అరెస్ట్ చేశారు. ఈ ముఠా నాయకుడిగా భావిస్తున్న అషార్ డానిష్ను ఝార్ఖండ్లోని రాంచీలో పట్టుకున్నారు.డానిష్'గజ్వా' అనే కోడ్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్నాడని, ఇతరులకు సందేశాలు పంపుతున్నాడని పోలీసులు గుర్తించారు.అనుమానితుల నుంచి భారీ ఎత్తున రసాయనాలు, ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, సల్ఫర్ పౌడర్ వంటి ప్రమాదకర రసాయనాలతో పాటు ఒక పిస్టల్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, బేరింగులు, డిజిటల్ పరికరాలు వారి వద్ద లభించాయి.
బోధన్ లో అరెస్టయిన యెమన్ ఎవరు?
తెలంగాణ లోనూ ఉగ్రలింకులు వున్నాయని గుర్తించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, నిజామాబాద్జిల్లా బోధన్ పట్టణంలోని అనుమానిత ప్రాంతాల్లో బుధవారం తనిఖీలు నిర్వహించి, హుజైఫ్ యెమెన్ను ను అరెస్ట్ చేశారు.అనంతరం ఎడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ జరిపారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకుని తమ వెంట తీసుకెళ్లారు.బోధన్ ఉగ్రలింకుల కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.బోధన్కు చెందిన యామన్ బీ-ఫార్మసీ చదువుతున్నాడు.యెమన్ ఇటీవల ఝార్ఖండ్ లో అరెస్ట్ చేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాది డానిష్తో చాటింగ్, వీడియో కాల్ మాట్లాడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇతర దేశస్తులతోనూ యెమన్ మాట్లాడినట్టు గుర్తించారు. వీరికి నాయకుడిగా భావిస్తున్న డానిష్ అరెస్టు తరువాత ,అతడిని విచారిస్తున్న క్రమంలోనే బోధన్ యువకుడి పేరు బహిర్గతమైనట్లు పేర్కొంటున్నారు.కృష్ణజింకను చంపిన కేసులో యెమన్ తండ్రి కూడా నిందితుడిగా ఉన్నాడు.
డానిష్కు రసాయన ఆయుధాల తయారీలో ప్రత్యేక నైపుణ్యం ఉందని, వీరంతా ఏదో ఒక భారీ దాడికి ప్రణాళిక రచించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్ లోని హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.అంతకుముందు కూడా బోధన్ లో ఉగ్రలింకులు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.