బ్లాక్మెయిల్ రాజకీయాలు టీడీపీ చేయలేదు
తెలుగుదేశం పార్టీకి అధికారం ముఖ్యం కాదని, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని సీఎం చంద్రబాబు వెల్లడించారు.;
తెలుగుదేశం పార్టీ ఏ నాడు కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయలేదని, అలాంటి రాజకీయాలు తాము చేయమని టీడీపీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు అన్నారు. విశ్వసనీయతకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని ఆయన పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన టీడీపీ శ్రేణుల విస్తృత సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి అధికారం ముఖ్యం కాదని, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని వెల్లడించారు. తెలుగు జాతి ప్రయోజనాలు తమకు ముఖ్యమని, ఆ విధంగానే ముందుకెళ్లామన్నారు.
తెలుగుదేశం పార్టీకి చాలా అవకాశాలు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రాజకీయ పార్టీకి రానన్ని అవకాశాలు టీడీపీకి వచ్చాయి. టీడీపీ ఒక ప్రాంతీయ పార్టీ. అయినా కేంద్రంలో కీలక పాత్ర పోషించాం. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు ఎన్టీఆర్. తర్వాత యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి కేంద్రంలో రెండు ప్రభుత్వాలను తన హయాంలో ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. నాటి కేంద్ర ప్రభుత్వంలోనే ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన టీడీపీ నాయకుడు ఎర్రం నాయుడు నాడు కేంద్రంలో మంత్రి అయ్యారు.. తర్వాత నేడు ఎర్రం నాయుడు కుమారుడు రామ్మోహన్నాయుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.
ఎన్డీఏ వాజ్పేయి ప్రభుత్వంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో టీడీపీ కీలక పాత్ర పోషించిందన్నారు. 2014లో మళ్లీ అవకాశం వచ్చిందన్నారు. అదేమాదిరిగా 2024లో కూడా మళ్లీ అలాంటి అవకాశమే వచ్చిందన్నారు. కేంద్రంలో అలా ఎప్పుడు అవకాశం వచ్చినా.. ఆ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీ ఉపయోగించిందన్నారు. ఈ సారి కేంద్ర ప్రభుత్వం సాకారం లేకపోతే వెంటిలేటర్పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. కేంద్రంలోని పెద్దలు సహకరించారు.. దీంతో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. సరైన సయమంలో సరైన నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీకి సహకరించారని అన్నారు. 2024 ఎన్నికల్లో ఒక సారి చూస్తే.. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు.