జగన్‌ను కొణతాల అంత మాట అనేశాడేంటి?

సీఎం జగన్‌‌పై టీడీపీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే అందరి జీవితాలను మారుస్తామని హామీ ఇచ్చారు.

Update: 2024-04-24 09:57 GMT

(శివరామ్)

‘‘ఒక్క ఛాన్స్ అని అధికారం వచ్చాక తల్లిని చెల్లిని మెడపట్టుకొని బయటకు గెంటేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే’’ అని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. అటువంటి వ్యక్తి ప్రజలను ఏ విధంగా చూసుకుంటాడని, సొంత తల్లినే గెంటేసిన జగన్‌కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని అన్నారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో తాళ్లపాలెం ఊగ్గినపాలెం గ్రామాల్లో జరిగిన ఎన్‌ఆర్‌ఈ‌జీ‌ఎస్ ఉపాధి హామీ కూలీలతో బుధవారం జరిగిన సమావేశంలో కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు.

‘‘మద్యపాన నిషేధం అని చెప్పి ఓట్లు అడిగిన ముఖ్యమంత్రి నిషేధం చేయలేదు సరి కదా తానే సొంతంగా బినామీ పేర్లతో అధిక ధరలతో సారా వ్యాపారాలు చేస్తున్నారు’’ అని విమర్శించారు. ముఖ్యమంత్రి దొంగ మద్యం వ్యాపారం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది అమాయకులు అనారోగ్యాల పాలై మరణించారని అవేదన వ్యక్తం చేశారు. కశింకోట మండలం విస్సన్నపేటలో 600 ఎకరాలు భూ కబ్జా చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రజలకు ఏం చేశాడో ఒక్కసారి ఆలోచించుకోవాలని, ఎక్కడ చూసినా భూకబ్జాలు, మైనింగ్ వ్యాపారాలే తప్ప అభివృద్ధి లేదని కొణతాల అన్నారు.

ఈ సమావేశాల్లో మండల స్థాయి నాయకులు, పలువురు ఉపాధి హామీ కూలి పనికి వచ్చిన ఆడవారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా గ్రామ సమస్యలను మా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణను కోరారు. రామకృష్ణ మాట్లాడుతూ.. ఇప్పుడు మీరు చేస్తున్న పనికి ఆహార పథకం (ఎన్ఆర్ఈజీఎస్)లో భాగంగా ప్రస్తుతం ఏదైతే 300 రూపాయలు మీకు అందుతుందో దానికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 400 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీ ఆడపిల్లల పెళ్లి సమయంలో లక్ష రూపాయలు పెళ్లి కానుకగా ఇవ్వబడునని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు జిల్లా మొత్తం ఎక్కడికి వెళ్లాలన్నా ఉచిత ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం అందుతుందని, వంటింటి మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీలు ఇచ్చారు.

Tags:    

Similar News