టార్గెట్‌ వైఎస్సార్‌సీపీ

వైఎస్సార్‌సీపీ టార్గెట్‌గా రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయి. అవి ఏ విధంగా నిర్వహిస్తారు? ఎటువంటి సమస్యలు పరిష్కరిస్తారో తెలుసుకుందాం...

Update: 2024-08-11 15:05 GMT

భూమి సమస్యలు చాలా సున్నితమైనవి. ప్రస్తుతం భూమి విలువ పెరిగి పోయింది. అడుగు భూమిని కూడా వదులుకునేందుకు భూ యజమానులు అంగీకరించడం లేదు. 22 (ఎ) కింద ఉన్న భూములు గత ప్రభుత్వం తనకు అనుకూలురైన వారికి దారాదత్తం చేసిందని, అటువంటి భూముల్లో ఎప్పటి నుంచో ఉంటున్న వారిని సైతం గెంటేసిందనే ఆరోపణలు ఉన్నాయి. మ్యుటేషన్‌లో రెవెన్యూ కార్యాలయం నుంచే ఎక్కువ సమస్యలు ఎదురవుతున్నాయి. పేర్లు తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారు. ఇవన్నీ ఇప్పుడు పరిష్కరించాలని 2019కి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నా యో పరిశీలించాలని, అడంగల్, పహనీ, ఆర్‌ఓఆర్, 1బీ రిజిస్టర్‌లు వంటి వాటిపై ప్రజల నుంచే వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఇవన్నీ గత ప్రభుత్వ చర్యలను దృష్టిలో పెట్టుకునే ఉంటాయి. పోలీసు భద్రత మధ్య రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు, ప్రజా ప్రతినిధులకు రక్షణ లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త ప్రభుత్వం వచ్చాక స్వీకరిస్తోన్న వినతిపత్రాల్లో సగానికిపైగా భూ వివాదాలపైనే ఉంటున్నాయని ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు. 45 రోజుల పాటు ఊరూరు తిరిగి అధికార యంత్రాంగాన్ని మోహరించి ఎక్కడికక్కడే సమస్యలు తెలుసుకోవడం, ఆ తర్వాత 45 రోజుల్లో వాటికి పరిష్కారం చూపడం... ఇదే ప్రస్తుత టార్గెట్‌. ఈ నెల 15న మంత్రులు లాంఛనంగా గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తారు.
సదస్సుల తేదీలు 13 నాటికి ఖరారు
జిల్లాలు, మండలాల వారీగా గ్రామాల్లో సదస్సుల నిర్వహణ తేదీలను 13నాటికి ఖరారు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. సదస్సుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఓ సీనియర్‌ ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తారు. జేసీ నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు. ఈ సదస్సుల్లో జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్, జడ్‌పిటీసీ సభ్యులు, మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా కలెక్టర్‌లు తగిన చొరవ తీసుకోవాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశించారు.
సదస్సుల్లో ఏం చేస్తారంటే..
గ్రామ రెవెన్యూ సదస్సుకు రెండు రోజుల ముందే ప్రభుత్వం గ్రామ రెవెన్యూ మ్యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు భూముల మ్యాప్‌లను ప్రకటిస్తుంది. సదస్సులకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, అటవీ, దేవదాయ, వక్ఫ్‌ శాఖల మండల, గ్రామ స్థాయి అధికారులు హాజరవుతారు. భూ కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లలో మార్పులు, వారసత్వం పేర్ల నమోదు, సరిహద్దు సమస్య, భూ విస్తీర్ణంలో తేడాలు, రీసర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు ఇచ్చిన రికార్డుల్లో నమోదైన తప్పులు, ప్రజల నుంచి వైసీపీ నేతలు లాక్కున్న భూములు, భూ కబ్జాలు, భూ ఆక్రమణలు, అసైన్డ్, చుక్కల భూముల పరాధీనం వంటి అంశాలపై బాధితుల నుంచి అర్జీలు తీసుకుంటారు. 2019కి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నా యో పరిశీలిస్తారు. అడంగల్, పహనీ, ఆర్‌ఓఆర్, 1బీ రిజిస్టర్, 22 (ఏ) జాబితాలను అందుబాటులో ఉంచుతారు. వాటిపై ప్రజల నుంచే వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తారు. తహసీల్దార్ల నేతృత్వంలో అవసరమైతే భూములను పరిశీలన చేస్తారు. రీ సర్వే జరిగిన గ్రామాల్లో ఆర్‌ఓఆర్‌ రికార్డును ప్రజల సమక్షంలో చదివి వినిపించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కొత్త పాస్‌ పుస్తకాలు ఇచ్చేందుకు జగన్‌ బొమ్మలున్న పాస్‌ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని సూచించింది. జగన్‌ బొమ్మలున్న పాస్‌ పుస్తకాలను తహసీల్దార్లు ధ్వంసం చేయాలని రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ సిసోడియా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. గ్రామంలో జగన్‌ పేర్లు, బొమ్మలతో సర్వేరాళ్లు ఉంటే, వాటిపై పేర్లను చెరిపివేయాలని ఆదేశించారు.
ఐదు కేటగిరీలుగా..
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఐదు రిజిస్టర్లలో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 1. మ్యుటేషన్, 2. కౌలు రైతు కార్డులు (ఎల్‌ఈసీ), 3. భూమి వివాదాలు, 4. భూ ఆక్రమణ, 5. నిషేధ జాబితా 22 (ఏ) గోల్‌మాల్‌ రిజిస్టర్లను నిర్వహిస్తారు. వీటిలో నమోదుచేసి, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. వీటిని ఆర్‌టీజీఎస్‌ విభాగం పర్యవేక్షిస్తుంటుంది. ఫిర్యాదు ఇచ్చిన వారికి వెంటనే ఓ రశీదు ఇస్తారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ అనేది ప్రభుత్వం చేపట్టిన పెద్ద టార్గెట్‌. అందుకే ప్రజా ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతు నేతలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, భూ సమస్యలపై పనిచేస్తోన్న ఎన్‌జీవోలను పిలిచి సదస్సుల ఆవశ్యకతను తెలియజేయాలని ప్రభుత్వం కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా, డివిజన్, మండల, గ్రామం వారీగా రెవెన్యూ సదస్సుల నిర్వహణ, వాటి లక్ష్యాలు తెలిపేలా ప్రచారం చేయాలని నిర్దేశించింది.
90 రోజుల టార్గెట్‌: ఆర్పీ సిసోడియా
ఈ నెల 15నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ఆ తర్వాత మరో 45 రోజుల్లో అంటే నవంబరు 15 నాటికి వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అర్జీదారుకు ఫోన్‌చేసి పరిష్కారంపై వివరించాలని ఆదేశించారు. పర్యవేక్షణకు ఆర్టీజీఎస్‌ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.
Tags:    

Similar News