సూపర్ సిక్స్–సూపర్ హిట్
మనది డెడ్ ఎకానమీ కాదు.. గుడ్ ఎకానమీ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.;
By : The Federal
Update: 2025-08-15 06:28 GMT
సూపర్ సిక్స్... సూపర్ హిట్ అంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అమలు చేసిన సామాజిక భధ్రత ఫించన్లు మొదలుకుని శుక్రవారం ప్రారంభించిన స్త్రీ శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వరకు ప్రతి అంశాన్ని ఆసాంతం వివరించారు. ఫించన్లు, తల్లికి వందనం, దీపం–2.0, అన్నదాత సుఖీభవ వంటి పథకాల గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే ఏపీ బ్రాండ్ గురించి.. పెట్టుబడుల సాధనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. దీంతో పాటు రాష్ట్రంలోని వివిధ వర్గాలకు అందించిన సేవలను.. ఆయా రంగాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
శాంతి భద్రతలపై ప్రభుత్వ విధానాన్ని ప్రస్తావించిన సందర్భంగా పరోక్షంగా వైసీపీకి చంద్రబాబు చురకలంటించారు. గత ప్రభుత్వం నిలిపేసిన పథకాలను తాము పునరుద్దరించామనే విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక ఇరిగేషన్ రంగంలో జరిగిన పరిణామాలను వివరిస్తూ.. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు గురించి కీలక ప్రస్తావన చేశారు. వృధాగా సముద్రంలో కలుస్తున్న వరద జలాలను వినియోగించుకుంటే.. ఎగువ రాష్ట్రాలకు ఇబ్బంది ఉండదని చెప్పడం ద్వారా బనకచర్ల విషయంలో ప్రభుత్వ విధానాన్ని మరోసారి చంద్రబాబు స్పష్టం చేశారు. వరద వచ్చినప్పుడు కిందకు వదిలేస్తున్న వాళ్లు.. అదే వరద నీటిని వాడుకుంటే అభ్యంతరం చెప్పడం సమంజసమా అని చంద్రబాబు ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం, బీఆర్ఎస్ పార్టీ బనకచర్ల విషయంలో చేస్తున్న వాదనల నేపథ్యంలో ఏపీ వాదనను.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని స్వాతంత్య్ర దినోత్సవ వేదికగా మరోసారి స్పష్టం చేయడం ఆసక్తి పరిణామంగా నిలిచింది. హంద్రీ–నీవా కాల్వల వెడల్పు పనులను రికార్డు స్థాయిలో పని చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూనే.. ఈ ఏడాది ఉత్తరాంధ్ర, గాలేరు–నగరి వంటి ప్రాజెక్టులపై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చంద్రబాబు పంద్రాగస్టు ప్రసంగంలో వెల్లడించారు. తాజాగా కేంద్రం ప్రభుత్వం కేటాయించిన సెమీ కండక్టర్ల యూనిట్ గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధుల కేటాయింపు వంటి అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. దీంతోపాటు ఇటీవల అమెరికా భారతదేశంపై విధించిన సుంకాల నేపథ్యంలో మన దేశ ఎకానమీ గురించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మనది డెడ్ ఎకానమీ కాదు.. గుడ్ ఎకానమీ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. తద్వారా రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు ప్రధానికి అండగా ఉంటామని చంద్రబాబు సంకేతామిచ్చారు. అలాగే ఆపరేషన్ సిందూర్ చేపట్టిన త్రివిధ దళాలకు సీఎం స్వాతంత్య్ర దినోత్సవ వేదికపై నుంచి సెల్యూట్ చేశారు. వివిధ శాఖల ప్రగతిని వివరిస్తూ ప్రదర్శించిన శకటాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.