ఏమి జరిగిందో 72 గంటల్లో నివేదిక ఇవ్వండి
ఉన్నతాధికారులతో విచారణ చేపట్టేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు.;
By : The Federal
Update: 2025-04-30 07:25 GMT
సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో గోడ కూలి 8 మంది మృతి చెందిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం ఉండల్లి తన నివాసంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి డీజీపీ హరీష్కుమార్ గుప్తాతో పాటు ఇతర ఉన్నత అధికారులు హాజరయ్యారు. దుర్ఘటన జరిగిన తీరు మీద ఆయన సమీక్ష జరిపారు. ఘటన జరిగిన తర్వాత బాధితులకు ఎలా సాయం అందుతోందనే దానిపై కూడా సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు.
ఈ దుర్ఘటన మీద విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీని కోసం ఉన్నత అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ, ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావులను ఈ కమిటీలో సభ్యులుగా ఏర్పాటు చేశారు. గోడకూలిన దుర్ఘటన మీద క్షుణ్ణంగా అధ్యాయనం చేసి ప్రాథమిక నివేదికను అందించాలని దేశించారు. 72 గంటల్లోనే ఈ రిపోర్టును సబ్మిట్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కమిటీ అధికారులు గోడ కూలిన దుర్ఘటనపై విచారణ చేపట్టేందుకు రంగంలోకి దిగారు.